క్యాబిన్ ల్యగేజీ విషయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది, ఆర్మీ అధికారి కి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. పరిమితికి మించిన లగేజ్ను క్యాబిన్లోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ అధికారి ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకున్నారు. అదనపు ఛార్జీలు చెల్లించాలని కోరితే అందుకు ఆయన నిరాకరించారు. బోర్డింగ్ ప్రక్రియ పూర్తిచేయకుండానే లోపలికి ప్రవేశించడంతో సిబ్బంది ఆయనను అనుమతించలేదు. దీంతో సిబ్బందిపై దాడిచేసి ముష్ఠిఘాతాలు కురిపించారు. ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడిలో నలుగురు ఎయిర్లైన్స్ సిబ్బందికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే స్పైస్జెట్ ఎయిర్లైన్స్ విమానంలో ఆర్మీ అధికారి టిక్కెట్ బుక్ చేసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేందుకు వచ్చిన ఆయన.. 16 కిలోల హ్యాండ్ బ్యాగేజీ (క్యాబిన్ లగేజ్) తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం.. క్యాబినెట్ లగేజి పరిమితి 7 కిలోలు. దీనికి రెండింతలు ఎక్కువే ఆయన తీసుకురావడం సమస్య ఉత్పన్నమైంది. లగేజీకి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బోర్డింగ్ సమయంలో సిబ్బంది చెప్పినా ఆయన నిరాకరించారు. అంతేకాదు, బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండా బలవంతంగా ఎయిరో బ్రిడ్జ్లోకి ప్రవేశించారు.
ఈ సమయంలో సిబ్బంది అడ్డుకోవడంతో రెచ్చిపోయారు. చెక్-ఇన్ గేట్ వద్ద ఉపయోగించే సైన్బోర్డుతో ఉద్యోగులపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించినా.. ఆర్మీ అధికారి మాత్రం ఆగలేదు. సిబ్బందిని దూషిస్తూ పదేపదే దాడులు చేశారు. ఈ ఘటనలో ఒకరికి వెన్నెముకకు గాయం కాగా.. ముగ్గురికి ముఖం, దవడపై గాయాలయ్యాయి. ఓ ఉద్యోగి అపస్మారక స్థితిలో కింద పడిపోయినా ఆర్మీ అధికారి వదిలపెట్టలేదు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, గతంలోనూ విమాన సిబ్బందిపై పోలీసులు, ఆర్మీ అధికారులు దాడిచేసిన దాఖలాలు ఉన్నాయి.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పైస్జెట్.. ఆర్మీ అధికారిని నో-ఫ్లై లిస్ట్లో చేర్చే ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ‘తమ ఉద్యోగులపై హింసను స్పైస్జెట్ తీవ్రంగా ఖండిస్తోంది. చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటుంది’ అని సంస్థ ప్రకటనలో తెలిపింది. అటు, CISF కూడా స్పందిస్తూ.. తమ సిబ్బంది తక్షణమే స్పందించి జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారని, విమాన సర్వీసులు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే, ఆర్మీ వర్గాలు కూడా ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించినట్టు తెలిపాయి. విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa