ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాలేగావ్ బాంబు పేలుళ్లు కాంగ్రెస్ కుట్రనే..: మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 08:39 PM

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత.. మధ్య ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ, సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆదివారం రోజు భోపాల్‌కు చేరుకున్నారు. ఈక్రమంలోనే ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై పెట్టిన కేసు కాంగ్రెస్ కుట్ర అని, ఆ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు ‘కాషాయ ఉగ్రవాదం’ అనే నినాదాన్ని ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు అని సాధ్వి పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసిందని సాధ్వి ఆరోపించారు. 'హిందుత్వ ఉగ్రవాదం' అనే అపవాదుతో కాంగ్రెస్ హిందువులను వేధించిందని, వారిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన ఈ చర్యలు దేశద్రోహానికి పాల్పడటమేనని సాధ్వి తీవ్రంగా విమర్శించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదానికి మతాన్ని అంటగట్టిందని, అమాయకులను ఇరికించిందని అన్నారు.


మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్ తొమ్మిదేళ్ల పాటు జైలులో గడిపారు. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా తేల్చడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఆమె తన ఆరోగ్య సమస్యలకు కారణం అప్పటి పోలీసులు చిత్రహింసలేనని ఆరోపించారు. కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్లు చెప్పాలని తనపౌ ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపించారు. కానీ అవన్నీ అబద్ధాలే కావడం వల్ల తాను ఏమీ చెప్పలేదన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు సృష్టించిన ఈ తప్పుడు కథనం కారణంగా తన జీవితంలో 17 సంవత్సరాలు వృథా అయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ కేసు దర్యాప్తు అధికారి అయిన హేమంత్ కర్కరే తన శాపం కారణంగానే చనిపోయారని ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఆమెకు బీజేపీ లోక్‌సభ టికెట్ నిరాకరించిన తర్వాత కూడా ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పానని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన వ్యాఖ్యలు నచ్చలేదని తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా మాలెగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా బయటపడిన తర్వాత ఆమెకు భోపాల్‌లో లభించిన స్వాగతం, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారితీశాయి. హిందుత్వం విజయం సాధించిందని, అబద్ధాలు ప్రచారం చేసినవారికి సరైన సమాధానం లభించిందని ఆమె అభిమానులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa