ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొంచెం కూడా కామన్‌సెన్స్ లేదా? దినేష్ కార్తీక్, నాసర్ హుస్సేన్ ఫైర్

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 09:07 PM

ఓవల్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ - ఇండియా మధ్య ఆఖరి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే ఇంకాసేపట్లో ఫలితం వస్తుంది అనగా.. నాలుగో రోజు అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం, వెలుతురు లోపం అనే కారణాలు చెప్పి ఆటను తక్షణం నిలిపివేయడం ఎవ్వరికీ నచ్చలేదు. స్టువర్డ్ బ్రాడ్‌తో సహా మాజీ క్రికెటర్లంతా అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డారు.


కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న భారత మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ , ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ మ్యాచ్ అధికారులపై ఘాటుగానే విమర్శలు చేశారు. వర్షం పడి ఆగిపోయినప్పటికీ వెలుతురు లేని కారణంగా మ్యాచ్‌ని నిలిపివేయడం సరైనది కాదని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. 20 వేల మంది అభిమానులు మైదానానికి వచ్చారు, వాళ్లని నిరాశపరిచినట్టే కదా అని కోప్పడ్డాడు. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై కప్పిన కవర్లు తీసేయలేమని చెబితే.. మ్యాచ్‌ని నిలిపేస్తారా? ఆశ్చర్యం కలిగిందంటూ నాసర్ హుస్సేన్ షాక్ అయ్యాడు.


"ఆదివారం రోజు మ్యాచ్‌ను చూడటానికి అభిమానులు ఎంతో ఖర్చు పెట్టుకోని వచ్చారు. సోమవారం రోజు ఉద్యోగాలు ఉంటాయి. అద్భుతమైన సిరీస్‌కు ఓ చక్కటి ముగింపు అవసరం. మ్యాచ్ అఫీషియల్స్‌కు చేతిలో ఇంకా 42-43 నిమిషాల సమయం ఉంది. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీయడం ఆలస్యం అవుతుంది అంటే మ్యాచ్‌ని నిలిపివేస్తారా? అయినా కూడా అదనంగా అరగంట అవకాశాన్ని ఉపయోగించాల్సింది. 7:30 వరకూ ఆటను కొనసాగించే అవకాశం ఉండేది" అని స్కై స్పోర్ట్స్‌లో మాట్లాడాడు.


"నాసర్ అన్న దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. రూల్స్ ఉంటే ఉండుండొచ్చు.. కానీ వర్షం వచ్చిందని అలా స్టంప్స్ చెప్పేయడం కరెక్ట్ కాదు. 6:45కి అయినా ఆటను మొదలుపెట్టి అదనపు సమయం ఇవ్వొచ్చు కదా? అలా జరిగి ఉంటే ఫలితం వచ్చుండే అవకాశం కూడా ఉండేది. ఇదో పెద్ద సిరీస్, ఇరు జట్లు కూడా బాగా ఆడుతున్నాయి. ఒక్కసారి అయినా రెండు జట్లను అడిగి కొనసాగించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటే బాగుండేది" అని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa