ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి అకౌంట్లోకి 5 లక్షలు.. డబ్బులు ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు

business |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 09:24 PM

ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా.. హాయిగా జీవించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాామాజిక భద్రతా పథకం ఈపీఎఫ అని చెప్పొచ్చు. దీనినే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. దీనిని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు దీనిని అమలు చేస్తుంటాయి. ఇక ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెలా 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. కంపెనీ కూడా అంతే మొత్తం యాడ్ చేయాలి. కంపెనీ జమ చేసే దాంట్లో 8 శాతానికిపైగా ఈపీఎస్‌లోకి వెళ్తే.. 3 శాతానికిపైగా పీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇది బేసిక్ పే పై వర్తిస్తుంది. ఈ నిధులపై ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రం వడ్డీ జమ చేస్తుంది. కిందటి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది.


ఇక ఇది రిటైర్మెంట్ ఫండ్ అందించే లక్ష్యంతోనే ప్రారంభించినప్పటికీ కొన్ని అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేలా.. పాక్షికంగా మధ్యలో కూడా నగదు తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది. ఇక ఇటీవల ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ఓ సేవల్ని సులభతరం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా పీఎఫ్ నగదు పరిమితిని పెంచడంతో పాటు.. వేగంగా అకౌంట్లో పడేలా.. పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండా.. చిక్కుల్లేకుండా సులభతరం చేసిందని చెప్పొచ్చు.


 మరీ ముఖ్యంగా అన్ని రకాల పీఎఫ్ క్లెయిమ్స్‌ను ఆటో సెటిల్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇక్కడ మానవ ప్రమేయం లేకుండానే.. డిజిటల్ రూపంలో క్లెయిమ్ ప్రాసెస్, సెటిల్మెంట్ జరుగుతుంది. ఇంకా ఇది 3 రోజులు అంటే 72 గంటల్లోపే సెటిల్ అవుతుంది. అకౌంట్లోకి డబ్బులు పడతాయి.


ఉద్యోగులు.. అనారోగ్యం, పైచదువులు, పెళ్లి, ఇల్లు కట్టుకోవడం లేదా రెనోవేట్ చేయడం వంటి వాటి కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా ఆటో సెటిల్మెంట్ పరిధిలోకే వస్తాయి. ఇక ఈ పరిమితి గతంలో రూ. లక్షగా ఉండగా.. ఇటీవల రూ. 5 లక్షలకు పెంచింది. అంటే ఉద్యోగి గరిష్టంగా తన పీఎఫ్ అకౌంట్ నుంచి రూ .5 లక్షలు ఒకేసారి తీసుకోవచ్చు కూడా. ఉద్యోగులకు తమ అవసరాల్లో త్వరగా డబ్బులు అందేలా తొలుత కొవిడ్ సమయంలో ఈ ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది.


ఈ అవసరాలతో పాటు ఉద్యోగి వరుసగా 2 నెలలకుపైగా జీతం అందుకోని సందర్భంలో కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ క్లెయిమ్‌ను ఆన్‌లైన్ ద్వారానే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా గతంలో మాదిరిగా పీఎఫ్ ఆఫీసులకు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో స్పష్టం చేసింది. సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే సరిపోతుందని వెల్లడించింది. మొబైల్ నంబర్ యూఏఎన్‌కు లింక్ అయి ఉండాలని.. ఆధార్ సీడింగ్ అయ్యి ఉండాలని.. కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa