అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా భారతదేశంపై అప్పుడప్పుడు చేసే విమర్శలకు భారత సైన్యం ఒక చారిత్రక సాక్ష్యంతో ఘాటుగా సమాధానం ఇచ్చింది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై కోపంతోనే 25 శాతం సుంకాలతో పాటు ఫెనాల్టీలు కూడా విధించింది. అంతటితో ఆగకుండా రష్యాతో వ్యాపారం చేస్తూ.. ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు సాయం చేస్తోందని ఆరోపించింది. ఈక్రమంలోనే భారత సైన్యం దీటుగా బదులు ఇచ్చింది. తప్పు చేసేది మేము కాదు మీరని పరోక్షంగా చెప్పేలా.. 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుండగా అమెరికా పెద్ద ఎత్తున దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేసినట్లు వివరించింది. కేవలం నోటి మాటతో కాకుండా అప్పుడు దీనిపై వచ్చిన వార్తా క్లిప్ను కూడా ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
1971వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ నాటి ఈ వార్తా పత్రిక కథనం.. అప్పటి భారత రక్షణ ఉత్పత్తి శాఖ మంత్రి వీసీ శుక్లా రాజ్యసభలో చేసిన ప్రకటనను ప్రస్తావిస్తుంది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు పాకిస్థాన్కు ఆయుధాలు ఇవ్వడం మానేసినప్పటికీ.. అమెరికా మాత్రం పాకిస్థాన్కు నిరంతరాయంగా ఆయుధాలను సరఫరా చేసిందని ఆయన పార్లమెంటులో పేర్కొన్నారు. 1954 నుండి పాకిస్థాన్కు అమెరికా సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందజేసిందని ఈ వార్తా కథనంలో స్పష్టంగా ఉంది. అమెరికా, చైనా కలిసి ఆయుధాలను చాలా తక్కువ ధరకే పాకిస్థాన్కు అమ్ముతున్నాయని, ఆ ఆయుధాలను బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య పోరాట యోధులపై జరిగిన హింసాకాండలో ఉపయోగించారని ఆ క్లిప్లో ఉంది.
1971 నాటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి ముందు.. పాకిస్థాన్ సైన్యం 'ఆపరేషన్ సెర్చ్లైట్' పేరుతో బంగ్లాదేశ్ ప్రజలపై భారీగా దాడులు చేసింది. 1971 డిసెంబర్ 3వ తేదీన భారత సైన్యం అధికారికంగా యుద్ధంలోకి ప్రవేశించిన తర్వాత కేవలం 13 రోజుల్లోనే బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ యుద్ధంలో 93,000 మందికి పైగా పాకిస్థానీ సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఆ తరువాత డిసెంబర్ 16వ తేదీన బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. భారత సైన్యం విడుదల చేసిన ఈ పాత క్లిప్ కేవలం చారిత్రక సంఘటనను గుర్తు చేయడమే కాకుండా, దక్షిణాసియాలో గందరగోళానికి అమెరికా గతంలో చేసిన చర్యలే కారణమని పరోక్షంగా సూచిస్తోంది.
అయితే ఇటీవలి కాలంలో రష్యా నుంచి చమురు కొనడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. భారత్ తన దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. అయినా అదేమీ పట్టించుకోని ట్రంప్ పదే పదే భారత్ను తప్పు బడుతున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇండియన్ ఆర్మీ.. అమెరికాకు ధీటైన జవాబు నిచ్చింది. ఒక్క పోస్టుతోనే కుండ బద్ధలు కొట్టి.. అమెరికా చేసిన తప్పేంటో చూపించేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎప్పుడూ ఇతరులను తప్పు పట్టే అమెరికా తన తప్పును తానెరుగదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa