దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం మరణించిన ఒక మహిళ బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా రూ. 1.13 లక్షల కోట్ల భారీ మొత్తం జమ అయింది. ఒక సాధారణ మహిళ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళ రెండు నెలల క్రితం మరణించింది. ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్.. తన తల్లి ఖాతాను నిర్వహిస్తుండేవాడు. అయితే ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఫోన్కి ఒక సందేశం వచ్చింది. అందులో 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 (ఒక లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలకు పైగా) డబ్బులు జమ అయినట్లుగా చూపించింది. మొదట ఈ సంఖ్యలో ఉన్న సున్నాలను చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. ఇది పొరపాటు అనుకుని తన స్నేహితులకు ఈ సందేశాన్ని పంపించాడు. వారు నిజంగానే మీ అమ్మ ఖాతాలో లక్షల కోట్లు క్రెడిట్ అయ్యాయని చెప్పగా.. అతడు కూడా ఖాతా చూసుకుని మరింత షాక్ అయ్యాడు. దీంతో సోమవారం రోజు ఉదయమే.. దీపక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖకు వెళ్లాడు.
ఈ సంఘటన గురించి బ్యాంకు అధికారులకు తెలియజేయగా.. వారు కూడా నివ్వెరపోయారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరగడం అసాధారణం కావడంతో.. వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేసి, ఈ విషయాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి తెలియజేశారు. ఈ వార్త క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో దీపక్కు ఫోన్ కాల్స్ వరదలా వచ్చి పడ్డాయి. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఆ డబ్బు గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. ఈ ఫోన్ కాల్స్ తాళలేక దీపక్ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది.
ఈ భారీ మొత్తం ఖాతాలో జమ కావడానికి పలు కారణాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది బ్యాంకింగ్ లోపం వల్ల జరిగిందా, సాంకేతిక సమస్య వల్ల జరిగిందా లేదా మనీలాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు సంబంధించినదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇంత పెద్ద మొత్తం ఒక సాధారణ వ్యక్తి ఖాతాలోకి, అందులోనూ మరణించిన వ్యక్తి ఖాతాలోకి రావడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించింది. దీని వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరిగింది, ఎవరు గాయత్రీ దేవి ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వేశారనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa