ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌లో జల ప్రళయం.. 300 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 07:58 PM

దాయాది దేశం పాకిస్తాన్ మీద వరుణుడు విరుచుకు పడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నెల రోజుల వ్యవధిలో కురిసిన వర్షాల వల్ల.. పాకిస్తాన్‌లో సుమారు 300 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 26 నుంచి ఇప్పటివరకు కూడా పాకిస్తాన్‌లో వరుణ బీభత్సం ఆగడం లేదు. భారీ వర్షాలు , వరదల ధాటికి అక్కడి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్రమంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్ట వివరాలను పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సుమారు 300 మంది వరదల వల్ల మృతి చెందారని తెలిపింది. ఆ వివరాలు..


పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాక్‌లో జూన్ 26 నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా సుమారు 299 మంది మృతి చెందారు. వీరిలో 140 మంది చిన్నారులే ఉన్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. రోజులకు తరబడి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావానికి పాక్ వ్యాప్తంగా సుమారు 715 మంది గాయపడ్డట్లు నివేదికలు వెల్లడించాయి. వీళ్లలో చిన్నారులు 239 మంది ఉండగా మిగిలిన వారిలో మహిళలు 204 మంది కాగా.. మరో 272 మంది పురుషులు ఉన్నట్లు తెలిపింది.


ఇక రుతుపవనాలు మొదలైన నాటి నుంచి పాక్‌లో కురుస్తున్న వర్షాల వల్ల ఆ దేశ వ్యాప్తంగా 1,676 ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వీటిల్లో 562 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయిని పేర్కొంది. వరదలు, వర్షాల ధాటికి మనుషులే కాక 428 మూగజీవాలు కూడా మృతి చెందాయి. ఇదిలా ఉండగా మరో 3 రోజులు కూడా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


ఇదిలా ఉండగా ఉంటే భారత దేశంలో కూడా గత కొన్ని రోజులుగా ఉత్తరాది, దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి భాగ్యనగరంలో భారీ వర్షం కురిసి.. రోడ్లన్ని చెరువులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు చుక్కలు చూశారు. ఇక మెట్రోకి ప్రయాణికుల తాకిడి పెరిగి.. స్టేషన్లన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఆగస్టు 10 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఇక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు సుమారు 252 మంది మంది మృతి చెందారు. అలాగే 254 రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 3 వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భోపాల్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌డీఆర్ఎఫ్బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు భారత వాతావరణ శాఖ ఉత్తరాది రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa