ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్రిక్తతలు తలెత్తడానికి ప్రధాన కారణం కాశ్మీర్ సమస్యనే,,,,పాకిస్తాన్ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 10:39 PM

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెబుతున్నప్పటికీ.. పాకిస్తాన్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇదే అంశంపై పదే పదే భారత్‌తో కవ్వింపులకు పాల్పడుతోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఇప్పటికే భారత్.. ఆ దేశంతోపాటు అనేక అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అప్పుడప్పుడూ పాక్ నేతలు కాశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. రెండు దేశాల మధ్య కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. కాశ్మీర్ అంశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండు దేశాల మధ్య కాశ్మీర్ అంశమే ప్రధాన సమస్యగా మారిందని పేర్కొనడం సంచలనంగా మారింది.


జమ్మూ కాశ్మీర్‌కు స్వతంత్య్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5వ తేదీన రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్టికల్ 370 రద్దును ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్.. ఆరోజును 'యుమ్-ఇ-ఇస్తేసాల్' (దౌర్జన్య దినం)గా పాటిస్తోంది. తాజాగా మంగళవారం (ఆగస్ట్ 5)వ తేదీన ఆర్టికల్ 370 రద్దు చేసి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ప్రసంగించారు.


కాశ్మీరీ ప్రజల కోరిక మేరకే ఈ సమస్య పరిష్కారం కావాలని షెహబాజ్ షరీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాశ్మీర్ విషయంలో న్యాయమైన పరిష్కారం లభించడం అనేది పాకిస్తాన్ విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన అంశమని పాక్ ప్రధాని వెల్లడించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. 2019 ఆగస్టు 5వ తేదీన భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు.


మరోవైపు.. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల అంశంపై పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కూడా మాట్లాడారు. తాము పొరుగున ఉన్న దేశాలతో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. పొరుగు దేశాలతో ఘర్షణలు, వివాదాల కంటే దౌత్యపరమైన సంబంధాలు, చర్చలకే ప్రాధాన్యతను ఇస్తామని తేల్చి చెప్పారు.


అదే సమయంలో ఎవరైనా తమపై దాడి చేస్తే మాత్రం.. అందుకు గట్టిగా బదులు ఇస్తామని ఇషాక్ దార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్‌పై ఎవరైనా దురాక్రమణలకు పాల్పడితే.. వారికి గట్టిగా బదులు ఇచ్చేందుకు తమ సైనిక దళాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa