పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సంగతి తెలిసిందే. పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద శిబిరాలను.. భారత దళాలు ధ్వంసం చేశాయి. దీంతో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడుల్లో పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలు, ట్రైనింగ్ క్యాంపులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు.. పాక్లోని ఉగ్రసంస్థలు కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. కీలక నేతలు కూడా హతమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ సిందూర్ ముగిసి 3 నెలలు గడిచింది. దీంతో ధ్వంసమైన శిబిరాలు, స్థావరాలను మళ్లీ నిర్మించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు పావులు కదుపుతున్నాయి. అందుకోసం నిధులు సేకరించే పనిలో పడ్డాయి.
భారత్లో కీలక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు.. ఆపరేషన్ సిందూర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసింది. పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్ను భారత వైమానిక దళం.. ధ్వంసం చేసింది. దక్షిణ పంజాబ్ ప్రావిన్స్లో సుమారు 100 కిలోమీటర్ల లోపల ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయాన్ని భారత్ నామరూపాల్లేకుండా చేసింది. మన దేశంలో 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి సహా అనేక ఉగ్రదాడుల వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది.
ఆపరేషన్ సిందూర్ జరిగిన దాదాపు 3 నెలల తర్వాత.. మౌలానా మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ తన హెడ్ క్వార్టర్స్ను పునర్నిర్మించుకునేందుకు విరాళాలను సేకరించే పనిలో పడింది. 2015లో నిర్మించిన ఈ హెడ్ క్వార్టర్స్ను యువకులను ఉగ్రసంస్థల్లోకి రిక్రూట్ చేసుకోవడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉపయోగించేవారు. ఈ విరాళాలకు సంబంధించి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సోషల్ మీడియాలో ఉర్దూలో ఒక పోస్ట్ చేసింది. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ అయిన 'జామియా మసీదు సుభాన్ అల్లా'ను తిరిగి నిర్మించేందుకు నిధుల సేకరణ చేస్తోందని పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా బహవల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరం లక్ష్యంగా భారత్ చేసిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లిందని మక్సర్ శాటిలైట్ చిత్రాలు కూడా వెల్లడించింది. భారత్ చేసిన ఆ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబంలోని 10 మంది సభ్యులతోపాటు మరో నలుగురు సహాయకులు చనిపోయినట్లు స్వయంగా ఆయనే పేర్కొన్నాడు. తన అక్క, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలుతోపాటు ఐదుగురు పిల్లలు చనిపోయినట్లు మసూద్ అజహర్ తెలిపాడు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ మే 6, 7 మధ్య రాత్రి పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రాంతాలపై 24 మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని.. పదుల సంఖ్యలో గాయపడినట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa