ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే పుట్టిన బిడ్డను,,,9వ అంతస్తు నుంచి విసిరేసిన తల్లి.. గాంధీనగర్ కోర్టు కీలక తీర్పు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 07:47 PM

అప్పుడే పుట్టిన శిశువును ఓ తల్లి 9వ అంతస్తు నుంచి విసిరివేసిన కేసులో గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 25 ఏళ్ల మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెలువరించింది. శిశువు జననాన్ని దాచేందుకు యత్నించడం సహా మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని ప్రయత్నించినందుకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఈ శిక్ష విధించింది. సదరు మహిళ తాను జన్మనిచ్చిన మగబిడ్డను తొమ్మిదో అంతస్తు నుంచి విసిరి వేశారంటూ కేసు నమోదైంది. అయితే ఆ మహిళపై నమోదు చేసిన హత్య కేసు అభియోగాలకు సరైన సాక్ష్యాధారాలు లభించకపోవటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2023 ఏప్రిల్ 19వ తేదీన.. గాంధీనగర్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలో ఉన్న స్కైవాక్ సొసైటీ వద్ద ఓ నవజాత మగ శిశువు మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన అనంతరం.. స్కైవాక్ సొసైటీ మొత్తం పది అంతస్తులు ఉండగా.. 9వ అంతస్తు నుంచి శిశువును విసిరేసినట్లు గుర్తించారు. తొమ్మిదో అంతస్తులోని బాత్రూమ్ నుంచి శిశువును విసిరేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. శిశువును హత్య చేయటం సహా చిన్నారి మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని ప్రయత్నించారనే ఆరోపణలపై ఆ మహిళ మీద ఐపీసీ సెక్షన్ 302, ఐపీసీ సెక్షన్ 318 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ప్రాసిక్యూషన్ 21 మంది సాక్షులను విచారించింది. సదరు మహిళ ఆ చనిపోయిన శిశువు కన్నతల్లిగా నిరూపించే వివిధ మెడికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లను సేకరించింది. అలాగే శిశువు తల్లిదండ్రులను గుర్తించారు. అయితే ఇన్ని చేసినప్పటికీ ఆ శిశువును కన్న తల్లే హత్య చేసిందని నిరూపించే సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ కోర్టులో నిరూపించలేకపోయింది. దీంతో దర్యాప్తు ముగిసిన అనంతరం.. గాంధీనగర్ సెషన్స్ కోర్టు సదరు మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించింది.


మహిళపై నమోదైన హత్య అభియోగాన్ని కొట్టివేసిన కోర్టు.. పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఆ మహిళ కావాలనే తన బిడ్డను చంపిందనేదానికి సరైన సాక్ష్యం లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఐపీసీ 302 సెక్షన్ వర్తించదని పేర్కొంది. సెక్షన్ 318 కింద ఆ మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఆ మహిళ 2023 ఏప్రిల్ నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa