ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. పురుషుల పరిస్థితేంటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 07:52 PM

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమం.. ఢిల్లీలో మొదలైన ఈ పథకం దక్షిణాది రాష్ట్రాలలోనూ గేమ్ ఛేంజర్‌గా మారింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల సమయంలో ఉచిత బస్సు పథకం కల్పిస్తామని చెప్పిన పార్టీలు.. ఆ తర్వాత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి అధికార పగ్గాలు చేపట్టాయి. ఇదే సంప్రదాయం ఏపీలోనూ కొనసాగింది. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ఇప్పటికే సిద్ధమైంది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తే.. పురుషుల సంగతేంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది.


తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు అందుబాటులో ఉంది. ఏపీలో స్త్రీ శక్తి పేరుతో దీనిని అమలు చేయనున్నారు. తెలంగాణ విషయానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో.. ఆర్టీసీ బస్సులలో పురుషుల సంఖ్యలో మార్పులు వచ్చాయనే చెప్పవచ్చు. దీంతో హైదరాబాద్ వంటి చోట్ల ప్రత్యేకంగా మెట్రో డీలక్స్ పేరుతో ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. అయితే ఉచిత బస్సు పథకం అమలు కానున్న ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పురుష ప్రయాణికులు తగ్గే ఛాన్స్ ఉంటుందని అంచనా. ఉచిత బస్సు పథకంతో బస్సులలో మహిళల రద్దీ నెలకొంటుందని.. దీంతో పురుషులు ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేవారిలో 60 శాతం మంది వరకూ పురుషులు ఉంటే.. 40 శాతం మహిళలు ఉంటున్నారు. అయితే స్త్రీ శక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగనుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలు చేయనున్నారు. దీంతో ఈ బస్సులలో పురుష ప్రయాణికుల సంఖ్య 33 శాతానికి తగ్గుతుందని, అదే సమయంలో మహిళల సంఖ్య 67 శాతానికి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి ఏటా రూ.288 కోట్లు రాబడి తగ్గే అవకాశం ఉందని అంచనా.


అలాగే ఫ్రీ బస్ జర్నీలో భాగంగా మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం సర్దుబాటు చేసే ఆలోచనలో ఉంది. దీంతో మహిళల ఛార్జీల విలువ ఏడాదికి రూ.1,453 కోట్లు అవుతుందని అంచనా. అలాగే ఉచిత బస్సు పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు కూడా అదనంగా రూ.201 కోట్లు పెరుగుతాయని లెక్కగడుతున్నారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కారణంగా ఆర్టీసీపై ప్రతి నెల సుమారుగా రూ.162 కోట్లు భారం పడుతుందని.. ఆ లెక్కన ఏడాదికి రూ.1,942 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa