దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉన్న అన్ని వీధి కుక్కలను గుర్తించి, వాటిని షెల్టర్లకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వును ఎనిమిది వారాల్లోగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆందోళనలను ప్రతిబింబించాయి. ముఖ్యంగా రేబిస్తో చనిపోయిన వారిని ఎవరు తిరిగి తీసుకు వస్తారని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. వీధి కుక్కల బెడద కేవలం ఒక ఇబ్బందికరమైన అంశం మాత్రమే కాదని.. అది ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన ప్రజా భద్రతా సమస్య అని సుప్రీం కోర్టు పేర్కొంది. వీధి కుక్కలు, వాటిని పెంచుకునే ప్రజల హక్కుల మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయ పడింది. కానీ మనుషుల ప్రాణాల కంటే జంతువుల సంక్షేమం ముఖ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో వీధి కుక్కల బెడద గత కొంతకాలంగా తీవ్రంగా పెరిగింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, ఉదయం పూట వాకింగ్కు వెళ్లేవారు, పిల్లలు వీధి కుక్కల దాడులకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. రేబిస్ వ్యాధి భయం కూడా ప్రజలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రజలందరికీ ఊరట కలిగించే అంశంగా పరిణమించింది. ఈ ఆదేశాల అమలుకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD), ఇతర స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఈ ఆదేశాల అమలు అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న వీధి కుక్కలను గుర్తించి, వాటిని తరలించడం ఒక పెద్ద సవాలు అని వివరిస్తున్నారు. వాటిని ఉంచడానికి సరిపడా షెల్టర్లు, సిబ్బంది, వనరులు చావా అవసరం అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా జంతు సంక్షేమ సంస్థల నుంచి వ్యతిరేకత కూడా ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలను కూడా పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు వీధి కుక్కల సమస్యపై ఒక కొత్త చర్చకు దారితీసి, ప్రభుత్వ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాల్సిన ఒత్తిడిని పెంచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa