ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దన్ఖడ్‌ను అడ్రెస్ చెప్పండి ప్లీజ్ ..: సంజయ్ రౌత్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 08:02 PM

దేశంలో ఇప్పుడు ఒక రాజకీయ మిస్టరీ చర్చనీయాంశంగా మారింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ మాజీ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన జాడ కనిపించకపోవడంతో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన దన్ఖడ్ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియజేయాలని కోరారు.


జూలై 21న దన్ఖడ్ అనారోగ్య కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇది రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారి తీసింది. సంజయ్ రౌత్ తన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దన్ఖడ్ రాజీనామా చేసిన రోజు ఉదయం రాజ్యసభ సమావేశాలను సాదారణంగానే నిర్వహించారని.. ఆయన అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లే కనిపించారని తెలిపారు. రాజీనామా తర్వాత దన్ఖడ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించిన ఇతర రాజ్యసభ సభ్యులు కూడా విఫలం అయ్యారని రౌత్ వెల్లడించారు. ఈ అస్పష్టత, గోప్యత కారణంగానే దన్ఖడ్‌ తన నివాసంలో నిర్బంధంలో ఉన్నారనే పుకార్లు ఢిల్లీలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని రౌత్ పేర్కొన్నారు.


 రౌత్ తన లేఖలో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. దన్ఖడ్‌ గురించి వాస్తవ సమాచారం కోసం ముందుగా హోంమంత్రిని సంప్రదిస్తున్నామని, ఒకవేళ సరైన సమాచారం లభించకపోతే.. సుప్రీం కోర్టులో "హెబియస్ కార్పస్" పిటిషన్ దాఖలు చేసేందుకు పరిశీలిస్తామని ఆయన హెచ్చరించారు. ఒక అత్యున్నత రాజ్యాంగ పదవిని నిర్వహించిన వ్యక్తి ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయమై స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "గల్లంతైన ఉపరాష్ట్రపతి" గురించి తాను ఎన్నడూ వినలేదని సిబల్ వ్యాఖ్యానించారు.


ఈ అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. దన్ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల భద్రత, శ్రేయస్సుపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుందని, ఈ విషయంలో పారదర్శకత చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. సంజయ్ రౌత్ లేఖకు కేంద్రం ఎలా స్పందిస్తుందోనని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి అమిత్ షా దీనిపై ఎలా స్పందిస్తారో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa