ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజమే చెప్పారు’ భారత్‌ను మెర్సిడేస్‌తో పోల్చిన పాక్ ఆర్మీ చీఫ్‌‌పై ట్రోల్స్

international |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 08:20 PM

అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ .. భారత్‌పై మరోసారి కవ్వింపులకు దిగారు. ఈ క్రమంలో అతడు భారత్‌ను ‘మెర్సిడేస్‌’తోనూ.. పాక్‌ను ‘డంప్ ట్రక్’తో పోల్చారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో మునీర్ మాట్లాడుతూ.... ‘మెర్సిడేస్ మాదిరి వేగంగా, సమర్థవంతంగా, సున్నితంగా భారత్ ప్రయాణిస్తుంది. ఆర్థికంగానూ, సైనికపరంగానూ పటిష్టంగా, వ్యవస్థీకృతంగా న్యూఢిల్లీ అభివృద్ధి చెందుతోంది.. మా దేశం ఒక డంప్ ట్రక్కులా ఉంది.. అది సున్నితమైంది కాకపోవచ్చు కానీ క్లిష్టమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తుంది.. ఇలాంటి ఓ ట్రక్కు వచ్చి మెర్సిడేస్‌ను ఢీకొడితే ఎవరికి నష్టం ఎక్కువగా జరుగుతుందో ఊహించుకోవచ్చు’ అంటూ అసిమ్ మునీర్ పిచ్చిప్రేలాపన చేశారు.


అయితే, మునీర్ మాత్రం భారత్ శక్తివంతమైన దేశమని పరోక్షంగా అంగీకరించారు. ఆర్ధికంగా ఎదుగుతోన్న పొరుగు దేశంగా చెప్పకనే చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో మునీర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆయన నిజమే చెప్పారని, పాకిస్థాన్ కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉందనే నిజాన్ని ఒప్పుకున్నారని ఏకిపారేస్తున్నారు.


‘‘మునీర్ ప్రకటనలో ఉన్న నిజం ఏంటంటే భారత్ మెర్సిడెస్, పాక్ డంప్ ట్రక్.. మిగిలింది శూన్యం’ అని ఒకరు కామెంట్ చేస్తే.... ‘మునీర్ అమెరికా నేల నుంచి అణు బెదిరింపులకు దిగి.. యుఎస్-చైనా చాటున దాక్కోవచ్చని అనుకుంటూ... పాక్ సైనిక శక్తిపై భ్రమల్లో ఉన్నాడు.. భారత్ ఆనకట్టలను నాశనం చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడు.. కానీ, దాయాది చరిత్ర చెత్తబుట్టలో అదృశ్యమవుతుంది.. ఏ మిత్రదేశాలు వాళ్లను కాపాడలేవు’ అని ఇంకొకరు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.


‘‘క్షిపణులతో నిండిన భారత్‌తో పెట్టుకుంటే మీకు ప్రమాదకరం.. ప్రాణాంతకం. మిమ్మల్ని నాశనం చేస్తుంది’’ మరో నెటిజన్ హెచ్చరించాడు. ‘‘పాక్‌లో డంప్ ట్రక్కులు తప్ప మరేమీలేవు.. వారి వాస్తవ పరిస్థితి వారికి బాగా తెలుసు..... విఫల సైనిక మార్షల్ దయనీయంగా ఉన్నామని అంగీకరించాడు’’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ఇంకొందరైతే తమ క్రియేటివిటీ ఉపయోగించి ఏఐ ఫోటోలతో పాక్ ఆర్మీ చీప్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. బోల్తా పడిన ట్రక్కు పక్కన మెర్సిడేస్ కారు ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నాను. ‘‘నేను దీన్ని తొలిసారి చదివినప్పుడు ఒక జోక్ అనుకున్నాను... కానీ కాదు, ఇది నిజం. దీనస్థితిలో ఉన్న పాకిస్థాన్‌ ఆర్మీకి చీఫ్‌గా అసిమ్ మునీర్‌ అర్హుడు’’ ఓ నెటిజన్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. అటు, భారత్‌పై అణు బెదిరింపులకు దిగిన పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa