ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 15 నాడు మాంసం తింటే ఏమవుతుంది, నిషేధం రాజ్యాంగ విరుద్ధం: అసదుద్దీన్ ఓవైసీ

national |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 09:34 PM

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ.. కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకున్న ఒక నిర్ణయం తీవ్రమైన రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఆగస్టు 15వ తేదీన మాంసం దుకాణాలు, వధశాలలను మూసివేయాలని కొన్ని నగర పాలక సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు, మిత్రపక్ష నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నిర్ణయం సరైనది కాదని, రాజ్యాంగ విరుద్ధమని వివరిస్తున్నారు. ఎవరెంత చెబుతున్నా వినకుండా మాంసం బంద్ చేస్తే.. ప్రజల వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని నేతలు ఆరోపించారు.


మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (గతంలో ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పరిధిలో మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఇదే విధంగా నాగ్‌పూర్, కళ్యాణ్ (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ) వంటి నగర పాలక సంస్థలు కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేశాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం జాతీయ, మతపరమైన పండుగలకు గౌరవం ఇవ్వడమేనని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇదే ఉత్తర్వులో జైన్ సమాజం ఆగస్టు 20వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరుపుకోబోతున్న 'పర్యూషణ పర్వ' సందర్భంగా కూడా మాంసం అమ్మకాలను నిషేధిస్తున్నట్లుగా ప్రస్తావించారు.


ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను అవివేకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా అభివర్ణించారు. మాంసం తినడానికి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంబంధం ఏమిటని ఓవైసీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలలో 99 శాతం మంది మాంసాహారులేనని గుర్తు చేశారు. ఈ మాంసం అమ్మకాలపై నిషేధాలు ప్రజల స్వేచ్ఛ, గోప్యత, జీవనోపాధి, ఆహారపు హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. హైదరాబాద్‌ నగర పాలక సంస్థ కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.


బీజేపీ మిత్రపక్షమైన ఎన్‌డీఏ కూటమిలోని నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిషేధాలు విధించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా మహావీర్ జయంతి, మహాశివరాత్రి వంటి మత విశ్వాసాలకు సంబంధించిన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధిస్తారని.. కానీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని పవార్ అభిప్రాయ పడ్డారు. ఈ నిర్ణయాలు ఒక నిర్దిష్ట వర్గం ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa