జమ్మూ కశ్మీర్లో గురువారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇద్దరు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బందితో సహా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి.చషోటి గ్రామం హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా చండీ ఆలయానికి చివరి రహదారి మార్గంగా ఉంది. అలాగే ప్రతి ఏడాది జరిగే మచైల్ మాతా యాత్రకు ప్రారంభ స్థానం. ఈ ఆకస్మిక వరదల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 38 మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ దళాలు సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వైద్య బృందాలు, సహాయక సామగ్రితో ఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa