అత్యుత్సాహం.. ఒక్కొక్కసారి ఇది మనకు మంచి చేసినా.. చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకో ఇప్పుడు చెప్పుకుందాం. పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లు అనే సామెత ఎప్పుడైనా విన్నారా.. అలాగే ఉంది ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ యవ్వారం. తన కారణంగా కాలనీ ప్రజలతో పాటుగా చివరకు పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే చివరకు కథ సుఖాంతం కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మహిళ తీరుతో స్థానికులు మాత్రం అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ గుత్తిలో నివాసం ఉంటున్నారు. అయితే తన బంగారు నగ పోయిందంటూ గురువారం ఆ మహిళ హడావిడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ముసుగు వేసుకుని తన ఇంట్లోకి వచ్చాడని.. తన నగను చోరీ చేశాడంటూ చెప్పుకొచ్చారు. మహిళ ఏడుపులు, పెడబొబ్బలతో వీధిలోని జనం కూడా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. దొంగ ఎటువైపు వెళ్లాడంటూ వీధులన్నీ జల్లెడ పట్టెడం మొదలెట్టారు.. ఇంతలోనే ఐదున్నర తులాల బంగారు నగ పోయిందంటూ ఎవరో పోలీసులకు కూడా సమాచారం కూడా ఇచ్చారు. దీంతో సీన్లోకి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. స్థానిక ఎస్ఐ సురేష్ తన టీమ్ను తీసుకుని అక్కడకు చేరుకున్నారు. దొంగతనం గురించి ఆరా తీశారు. అలాగే ఆ మహిళ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా వెతికారు. ఇంటి పరిసరాలను గాలించారు. ఈ క్రమంలోనే వారికి ఆశ్చర్యకరమైన విషయం కనబడింది.
నగ చోరీ అయ్యిందంటూ మహిళ చెప్తున్న ఆభరణం ఇంట్లోని బెడ్రూమ్లో ఉన్న మంచంపై కనిపించింది. మంచంపై ఉన్న దిండు వద్ద బంగారు నగను పోలసులు గుర్తించారు. అనంతరం ఆ మహిళకు ఈ నగను అప్పగించారు. దీంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది. అయితే నగను ఎక్కడో మర్చిపోయి.. ఆగంతకుడు తమ ఇంట్లోకి దూరి నగను చోరీ చేశాడంటూ మహిళ హడావిడి చేయటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మర్చిపోయి.. దొంగతనం అంటూ హడావిడి చేయడం ఏమిటని.. పోలీసులను కూడా పిలిపించడం వారికి ఇబ్బంది కలిగించటం ఎందుకంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇంకొంతమంది మాత్రం నగను పోగొట్టుకున్న కంగారులో, ఎలాగైనా తన బంగారు ఆభరణాన్ని వెతికిస్తారనే నమ్కకంతో మహిళ ఈ పని చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఏదేమైనా చివరకు మహిళ బంగారు నగ దొరకటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆగంతకులు ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా వేగంగా స్పందించారు. అయితే చివరకు నగను మహిళ ఇంట్లోనే గుర్తించడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa