ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవంతో పాటే పుట్టినరోజు జరుపుకుంటున్న జిల్లా.. ఏదా జిల్లా.. ఎందుకలా?(ఫోటోలు- TIMESOFINDIA.COM)
యావత్ భారతావని స్వాతంత్య్ర దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకుంటోంది. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లతో పోరాడుతూ అమరులైన వారిని స్మరించుకుంటోంది. భరతమాత దాస్యపు శృంఖలాలను తెంచి స్వేచ్ఛావాయువులు అందించిన సమరయోధులకు అంజలి ఘటిస్తోంది. అయితే ఏపీలోని ఓ జిల్లా స్వాతంత్య్ర దినోత్సవంతో పాటే పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటోంది. ప్రతి పంద్రాగస్టుకు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటే.. ఆ జిల్లావాసులకు మాత్రం ఆ రోజు రెండు పండగలు. అదే శ్రీకాకుళం జిల్లా . ఈ ఆగస్ట్ 15న శ్రీకాకుళం జిల్లా 75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకు అంటే 1950లో ఆగస్ట్ 15న శ్రీకాకుళం జిల్లా ఏర్పాటైంది. 1950లో విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాను వేరుచేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
శ్రీకాకుళం ప్రాంతం తొలుత ఉత్తర సర్కార్లలో భాగంగా ఉండేది, 1765లో మొఘల్ చక్రవర్తి జారీ చేసిన ఫర్మాన్ ద్వారా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. ఆ తరువాత 1768లో హైదరాబాద్ నిజాం దీనిని ఆమోదించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలు ఉత్తర సర్కార్లుగా పిలిచేవారు. ఈ ఉత్తర సర్కార్లను ముఖ్యంగా ఐదు జిల్లాలుగా విభజించారు. గంజాం, విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు. అయితే శ్రీకాకుళం ప్రాంతం విశాఖ జిల్లాలో ఉండేది. 1936లో ఒడిశాను ఏర్పాటు చేసినప్పుడు గంజాం ప్రాంతం ఒరిస్సాలోకి వెళ్లిపోయింది. శ్రీకాకుళం డివిజన్ను విశాఖలో చేర్చారు. అయితే 1950లో శ్రీకాకుళం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది.
అయితే ప్రత్యేక జిల్లాగా ఏర్పడి 75 ఏళ్లు గడుస్తున్నా శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి అంతంతమాత్రమేనని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆర్థిక - సామాజిక కొలమానాల్లో శ్రీకాకుళం ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా అక్షరాస్యత రేటు 61.7 శాతం. రాష్ట్ర సగటు కంటే ఇది సుమారుగా 6 శాతం తక్కువ. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పట్టణ జనాభా కూడా తక్కువే. విశాఖపట్నం జిల్లాలో పట్టణ జనాభా 47.45 శాతం ఉంటే.. శ్రీకాకుళం జిల్లాలో పట్టణ జనాభా 16.16 శాతం మాత్రమే. ఇక 2022 -23 ప్రకారం రాష్ట్ర జీడీపీలో విశాఖపట్నం జిల్లా వాటా 9.15 శాతం. ఇదే అత్యధికం.. అయితే ఇదే జిల్లా నుంచి ఏర్పాటైన శ్రీకాకుళం జిల్లా మాత్రం 26 జిల్లాలకు గానూ 20వ స్థానంలో ఉంది.
మరోవైపు 75వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకూ జిల్లావ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అయితే 193 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే.. అలాగే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa