ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్ ఎక్కే అవకాశమే ఇవ్వటం లేదా.. క్లారిటీ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 07:52 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పంద్రాగస్టు రోజున సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ కూడా అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలతో సంభాషిస్తూ.. స్త్రీ శక్తి పథకం అమలు గురించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం నుంచి ఏపీవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం - స్త్రీ శక్తి పథకం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.


ఫ్రీ అని చెప్పి..మహిళలకు బస్సులో ఎక్కే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


"ఇదొక ఫేక్ ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి గురించి అప్పుడే కొందరు కుట్రపూరిత ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఫ్రీ అని చెప్పి బస్సు ఎక్కే అవకాశం ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పాత ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసాడు. నిజానికి అది జులై 25న జరిగిన ఒక కళాశాలకు సంబంధించిన ఇష్యూ. అప్పటి ఫోటోను వాడుతూ వీళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఎవరూ ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దు. రాష్ట్రంలో ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపైనా.. ఈ పోస్టులను షేర్ చేస్తున్న వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది." అంటూ ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం ట్వీట్ చేసింది.


నారా లోకేష్ ఫ్రీ బస్ టికెట్ సెల్ఫీ ఛాలెంజ్..


మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం ప్రారంభం కావటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మహిళలను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ కీలక సూచన చేశారు. జీరో ఫేర్ టికెట్‌తో బస్సులో ప్రయాణించి.. ఆ టికెట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని.. ఫ్రీ బస్ టికెట్ సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


"ప్రతి ఉచిత బస్సు టికెట్.. ఆశ, స్వేచ్ఛ, గౌరవం కథ. ఇది కేవలం ప్రయాణం కంటే ఎక్కువ. ఇది స్వాతంత్ర్యం, సమాన అవకాశానికి సంకేతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు సాధికారత కల్పించడం పట్ల గర్వంగా ఉంది. సోదరీమణులారా, ఈ ప్రయాణాన్ని కలిసి జరుపుకుందాం! మీ టికెట్‌ను #FREEbusTicketSelfie తో పంచుకోండి. సాధికారత ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించండి."అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa