ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ కీలక వర్ష సూచన జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఆగస్టు 18, సోమవారం నాటికి మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఉన్న అల్పపీడనానికి ఇది తోడవడంతో, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనాల ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని ఆయన అంచనా వేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం ఉన్నందున, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.ఆదివారం నాటి వాతావరణ పరిస్థితులపై మాట్లాడుతూ, ఉత్తర కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయని వివరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa