ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు.. పుతిన్‌కు ట్రంప్ సతీమణి మెలానియా లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 08:32 PM

దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రష్యాను బెదిరించడం, బుజ్జగించడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాలోని అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ కావడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్-పుతిన్ సమావేశం కావడానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా ఫస్ట్ లేడీ, ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌ పర్సనల్‌గా ఒక లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి పలు ఇంటర్నేషనల్ మీడియాల్లో కథనాలు వచ్చాయి.


అలాస్కా జరిగిన ట్రంప్‌-పుతిన్ భేటీలో మెలానియా ఇచ్చిన లేఖను పుతిన్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. రెండు దేశాల్లో ఉన్న చిన్న పిల్లల పరిస్థితి గురించి మెలానియా ట్రంప్ ఆ లేఖలో ప్రస్తావించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. అయితే ఆ లేఖలో ఇంకా ఏమేం విషయాలు ఉన్నాయి అనేది మాత్రం ఇంకా బయటికి వెల్లడించలేదు.


2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటివరకు రెండు దేశాల్లో వేలాది మంది చనిపోయారు. ఇక చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులకు, కుటుంబాలకు దూరం అయ్యారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత.. వేలాది మంది చిన్నారులను రష్యా తీసుకెళ్లిందని ఇప్పటికే ఉక్రెయిన్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఈ చర్య యుద్ధ నేరం కింద వస్తుందని ఉక్రెయిన్ పేర్కొంటోంది. దీనిపై ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. యుద్ధం వేళ ఉక్రెయిన్‌లో తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న చిన్నారులను తాము కాపాడుతున్నామని.. రష్యా సమర్థించుకోవడం గమనార్హం.


ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపడమే ప్రధాన లక్ష్యంగా ట్రంప్‌.. పుతిన్‌తో అలాస్కాలో సమావేశం అయ్యారు. కానీ ట్రంప్, పుతిన్ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ.. యుద్ధాన్ని ముగించడానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకపోవడం గమనార్హం. అయితే.. తమ మధ్య సానుకూలంగా చర్చలు జరిగినట్లు ఇద్దరు నేతలు భేటీ తర్వాత వెల్లడించారు. ఇక ఇదే విషయంపై మరోసారి నిర్వహించే సమావేశంలో ఈసారి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా పాల్గొంటారని.. ట్రంప్ తెలిపారు. యుద్ధాన్ని విరమించేందుకు ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తానని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa