ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా నాన్న అస్థికలను ఇండియాకు తెప్పించండి.. ప్రభుత్వానికి నేతాజీ కుమార్తె విజ్ఞప్తి

national |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 07:29 PM

ప్రముఖ భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రేపు అనగా ఆగస్టు 18 సోమవారం నాడు నేతాజీ 80వ వర్ధంతి జరగనుంది. 1945 ఆగస్టు 18న జపాన్‌లో చోటు చేసుకున్న ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతారు. అందుకే ఆగస్టు 18న ఆయన వర్ధంతిని నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం నేతాజీ వర్ధంతికి ముందు రోజు.. ఆయన కుమార్తె అనితా బోస్ తన తండ్రి అస్థికలను భారత్‌కు రప్పించాలని కోరారు.


ఈ సందర్భంగా అనితా బోస్ మాట్లాడుతూ.. తాను ఎప్పటి నుంచో తన తండ్రి అస్థికలను ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాని చెప్పుకొచ్చారు. టోక్యోలోని రెంకో-జీ గుడిలో భద్రపరిచిన అస్థికలు తన తండ్రి నేతాజీవేనని చాలామంది నమ్ముతున్నారని ఆమె తెలిపారు. అందుకే వాటికి డీఎన్ఏ పరీక్ష చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలానే తన తండ్రి నేతాజీ మరణం చుట్టూ ఉన్న వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. తన తండ్రి మరణం చుట్టూ అల్లుకున్న ఆరోపణలకు.. శాస్త్రీయ ఆధారాలతో ముగింపు పలకాలని.. అలానే తన తండ్రి జ్ఞాపకాలను సరైన రీతిలో గౌరవించాలని కోరారు. తన తండ్రి అస్థికలను ఇండియాకు రప్పించడమే తన చిరకాల వాంఛ అన్నారు.


అయితే అనితా బోస్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు తెర మీదకు తెచ్చారంటే.. ఆగస్టు చివరి నాటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటకు వెళ్లనున్నారు. ఈక్రమంలో అనితా బోస్ ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేతాజీ తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు చెబుతారు. కానీ మరి కొందరు మాత్రం ఆయన బతికే ఉన్నారని.. అజ్ఞాతంలో జీవించారని చెబుతుంటారు.


అయితే నేతాజీకి ఆయన పురిటిగడ్డ భారతదేశంలోనే అంతిమ వీడ్కోలు పలకాలని అనితా బోస్ కోరుకుంటున్నారు. ఆయన చితాభస్మాన్ని ప్రజలందరూ చూసి నివాళులు అర్పించాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. అందుకే నేతాజీ అస్థికలను ఇండియాకు తెప్పించాల్సిందిగా ఆమె పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నేటికి కూడా సమాజంలో అనేక రకాల అనుమానాలున్నాయి. నేతాజీ 1945 ఆగస్టు 18న టోక్యోకు వెళ్తుండగా.. తైపీ నగరంలోని తైహోకులో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చాలా మంది నమ్ముతారు. తైపీలోనే నేతాజీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన అస్థికలను టోక్యోకు తరలించారు. అప్పుడు అక్కడున్న భారతీయులు అభ్యర్థన మేరకు రెంకో-జీ ఆలయ ప్రధాన పూజారి.. కొన్ని నెలల పాటు నేతాజీ అవశేషాలను సంరక్షించడానికి అంగీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేతాజీ అస్థికలు అక్కడే ఉన్నాయి. రెంకో-జీ ఆలయ ప్రస్తుత తరం ప్రధాన పూజారులు నేతాజీ అవశేషాలను సంరక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa