ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ప్రతినిధుల ఇండియా టూర్ రద్దు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 07:25 PM

అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా భారత్ మీద 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను మరో 25 శాతం అదనపు సుంకాలు విధించాడు. వెరసి ప్రస్తుతం భారత్ మీద అమెరికా 50 శాతం సుంకాలతో విరుచుకుపడుతుంది. త్వరలోనే దీనిపై ఇండియా , భారత్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇండియాతో వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం ఉన్నట్లుండి తన పర్యటనను రద్దు చేసుకుంది. ఆ వివరాలు..


అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై సుంకాలు పెంచడంతో.. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రతీకార సుంకాల్లో భాగంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రారంభంలోనే ట్రంప్ భారత్ మీద 25 శాతం సుంకాలు విధించాడు. అయితే రష్యాతో ఇంధన వాణిజ్యం మూలంగా ఆ టారిఫ్‌లను మరో 25 శాతానికి పెంచాడు. వీటిల్లో పాత సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇక తాజాగా విధించిన అదనపు 25 శాతం సుంకం మాత్రం మరో పది రోజుల్లో అనగా ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది.


అయితే అమెరికా తాజాగా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి రాకముందే.. వారితో చర్చలు జరిపి ఒక ఒప్పందం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటికే ఐదు సార్లు సమావేశమయ్యారు. ఆరోసారి చర్చల కోసం ఈ నెల 25-29 వరకు అమెరికా ప్రతినిధులు ఇండియాకు రావాల్సి ఉంది. కానీ వారు తమ పర్యటనను రద్దు చేసుకుననారు. తదుపరి చర్చల తేదీలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.


వ్యవసాయం, పాడి పరిశ్రమల రంగాలకు సంబంధించిన పలు అంశాల్లో భారత్, అమెరికా మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆరో దశ చర్చల్లో వీటిని పరిష్కరిస్తారని భావించారు. కానీ, అమెరికా ప్రతినిధుల పర్యటన రద్దు కావడంతో ఆ ఆశలు నెరవేరలేదు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో రెండు దేశాల అధ్యక్షుల మధ్య ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.


అమెరికా ప్రతీకార సుంకాల భారం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఒక సూచన చేశారు. స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడేది లేదని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa