ఐపీఎల్ 2025లో డెవాల్డ్ బ్రెవిస్ను సీఎస్కే తీసుకోవడంపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇతర ఫ్రాంఛైజీలు పోటీపడినా.. సీఎస్కే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి అతడిని దక్కించుకుందని అశ్విన్ ఇటీవల అన్నాడు. అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ స్పందించింది. తాము నిబంధనలు పాటించే అతడిని తీసుకున్నామని, ఇందులో ఎలాంటి తప్పూ జరగలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి స్పందించాడు.
అశ్విన్ కామెంట్స్తో వివాదం..
రవిచంద్రన్ అశ్విన్కు యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో క్రీడా విషయాలపై అతడు డిబేట్లు పెడుతుంటాడు. ఇటీవల డివాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ గాయపడ్డ గుర్జప్నీత్ సింగ్ ప్లేసులో డెవాల్డ్ బ్రెవిస్ను తీసుకుంది. అయితే ఇతర జట్లు పోటీ పడ్డప్పటికీ ధర చూసి వెనక్కి తగ్గాయని, సీఎస్కే పట్టుబట్టి మరీ దక్కించుకుందని అశ్విన్ అన్నాడు. దీంతో బ్రెవిస్ను దక్కించుకునేందుకు సీఎస్కే అక్రమాలకు పాల్పడిందనే ప్రచారం జరిగింది.
సీఎస్కే క్లారిటీ..
దీనిపై స్పందించిన సీఎస్కే.. అంతా పద్దతి ప్రకారమే బ్రెవిస్ రీప్లేస్మెంట్ జరిగిందని స్పష్టం చేసింది. గాయపడిన ప్లేయర్ ఫీజు కంటే అతడి స్థానంలో వచ్చే క్రికెటర్కు ఎక్కువ ఇవ్వొద్దనే రూల్ పాటించినట్లు తెలిపింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుర్జప్నీత్ సింగ్ను రూ.2.2 కోట్లకు సీఎస్కే దక్కించుకుంది. అదే మొత్తాన్ని బ్రెవిస్కు ఇచ్చింది.
సీఎస్కే జట్టు వివరణ ఇచ్చాక రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. "ప్రజలు, అభిమానుల్లో ఉన్న అనుమానాలను మాత్రమే నేను ప్రస్తావించా. ఇప్పుడు వాటిపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో జరిగే చర్చల కంటే కూడా.. క్రికెట్పైనే ఎక్కువ ఫోకస్ చేస్తా. మా అభిప్రాయాలు చెప్పేందుకే యూట్యూబ్ వీడియోలు చేస్తాం. వాటిని చూసిన వారు తప్పు చేయరు. కానీ చూడకుండానే కొందరు.. మా మాటలను వక్రీకరిస్తారు. ఫ్రాంఛైజీ, పాలకమండలి ఎలాంటి తప్పు చేయలేదు. ఆటగాళ్లను భర్తీ చేసుకోవడం అనేది సాధారణమే" అని అశ్విన్ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa