ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది

national |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 09:06 PM

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా, 1998 నుంచి 2004 వరకు లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు సంఖ్యాబలం స్పష్టంగా ఉంది. సుమారు 422 మంది సభ్యుల మద్దతు ఉండటంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న విడుదల చేసింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ కాగా, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది.మరోవైపు, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కూడా తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఎన్డీఏకు ఉన్న బలమైన సంఖ్యాబలం ముందు ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు కష్టమేనని అర్థమవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa