పాకిస్థాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిస్సిగ్గుగా సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్కు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పాక్లో ప్రస్తుతం పాలన మునీర్ చెప్పుచేతల్లోనే సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా భారత్ను ఉద్దేశించి మునీర్ చేసిన వ్యాఖ్యలకు పాక్ మంత్రి మద్దతు తెలపడం గమనార్హం. భారత్ను మెర్సిడేస్తోనూ, తన దేశాన్ని ‘డంప్ ట్రక్’తోనూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పోల్చిన సంగతి తెలిసిందే.
భారత్-పాకిస్థాన్ సైనిక సంఘర్షణ సమయంలో మునీర్ నాయకత్వాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ప్రశంసించడం గమనార్హం.
లాహోర్లో జరిగిన ఓ సెమినార్లో మొహ్సిన్ నఖ్వీతో మాట్లాడుతూ.. మే నెలలో భారత్తో యుద్ధం జరుగుతున్నప్పుడు పాక్ పర్యటనకు వచ్చిన సౌదీ ప్రతినిధి బృందంతోనూ మన పరాక్రమం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అదే సారూప్యతను ఉపయోగించారని అన్నారు. ‘‘ఫీల్డ్ మార్షల్ సౌదీ ప్రతినిధులతో భారతదేశం మెరిసే మెర్సిడెస్ లాంటిది.. కానీ మనం రాళ్లతో నిండిన డంప్ ట్రక్కు లాంటివాళ్లం.. అది ఢీకొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోండి’’ అని అన్నారు.. సౌదీ ప్రతినిధి బృందం దీనికి మౌనంగా ఉండిపోయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఆధారాలు కంటికి కనిపిస్తున్నా.. పాకిస్థాన్లోని ఏ ప్రధాన సైనిక స్థావరాన్ని భారత్ క్షిపణులు తాకలేదని నఖ్వీ పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, రన్వేలు, హ్యాంగర్లు, భవనాలను భారత్ సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించి ఉపగ్రహాలు తీసిన ఫోటోలను మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసింది. వైమానిక దళ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్లో.. భారత్ సైన్యం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసిందని, దాయాదిని చావుదెబ్బ కొట్టిందని అన్నారు.
గతవారం అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ప్రయివేట్ పార్టీకి హాజరైన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. భారత్పై బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ‘భారత్ మెర్సిడేస్ లాంటిది కానీ.. మేము పూర్తిగా రాళ్లతో ఉన్న డంప్ ట్రక్ లాంటి వాళ్లం.. కారును ట్రక్కు ఢీకొడితే ఎవరికి నష్టం?’ అంటూ కవ్వింపులకు దిగారు. ఈ వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇవ్వగా.. సోషల్ మీడియాలో అసిమ్ మునీర్ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. భారత్ శక్తివంతమైన దేశమని ఆయన నిజం ఒప్పుకున్నారని, ఆర్ధికంగా ఎదుగుతోన్న పొరుగు దేశంగా చెప్పకనే చెప్పారని ఏకిపారేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa