ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో సర్ఫరాజ్ సెంచరీతో సత్తా చాటాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ జట్టుపై కేవలం 114 బంతుల్లోనే 138 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసెజ్ పంపించాడు.
గోజన్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ పది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 138 పరుగులు నమోదు చేశాడు. స్పిన్నర్ ఎం.సిద్ధార్థ్ బౌలింగ్లో 42 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (30), హఱ్ష్ అఘవ్ త్వరగా అవుటవ్వడంతో ముంబై జట్టు 98 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో నెంబర్ 5లో వచ్చిన సర్ఫరాజ్ అద్భుతమైన కౌంటర్ అటాక్తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 5 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది.
ముంబై కెప్టెన్, ఐపీఎల్ హీరో ఆయుష్ మాత్రే కేవలం 13 పరుగులకే అవుటయ్యాడు. సువేద్ పార్కర్ 27 పరుగులతో సర్ఫరాజ్తో కలిసి 15.1 ఓవర్లు క్రీజులో నిల్చొని 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆకాశ్ పార్కర్ 100 బంతుల్లో 67 పరుగులతో నాటౌట్గా నిలవడంతో ముంబై తక్కువ స్కోర్కి ఆలౌట్ కాకుండా సేఫ్ జోన్కి వెళ్లింది.
అధిక బరువు కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ ఖాన్, ఈ సీజన్కు ముందు ఏకంగా 17 కిలో బరువు తగ్గాడు. ఫుల్ ఫిట్నెస్గా ఉన్న సర్ఫరాజ్ మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. టెస్టు జట్టులో మళ్లీ అవకాశాలు పొందాలని సర్ఫరాజ్ చూస్తున్నాడు. 2024లో టెస్టుల్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో హోం సిరీస్లో మొదటి మ్యాచ్లో 150 చేసినా, ఆ తర్వాత వరుసగా నిరాశ పరిచాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. భారత జట్టు వచ్చే నెల నుంచి బిజీగా ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో రెండు టెస్టులు, నవంబర్లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ బుచ్చి బాబు టోర్నీలో రాణించి సెలక్టర్ల దృష్టిని మళ్లీ ఆకర్షించాలని చూస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa