ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష కోట్లతో కేంద్రం కొత్త పథకం.. ఒక్కొక్కరికి రూ.15000

business |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:52 PM

ఉపాధి, ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రకటించిన కేంద్రం ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌ను తాజాగా ప్రారంభించింది. ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చినట్లు పీఐబీ ఓ ప్రకటన చేసింది. ఈ కొత్త పథకం ద్వారా తొలిసారి ఉద్యోగంలో చేరే ఒక్కొక్కరికి రూ.15000 అందిస్తామని తెలిపింది. అలాగే ఉపాధి కల్పించే కంపెనీలు, యాజమాన్యాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఉంటాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందవచ్చని వెల్లడించారు.


ఉద్యోగ, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి జూలై 1, 2025 రోజునే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1 లక్ష కోట్లతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. వచ్చే రెండేళ్లలో అంటే 2025, ఆగస్ 1 నుంచి 2027 జూలై 31 వరకు 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఈ పథకాన్ని రెండు భాగాలుగా పార్ట్ ఏ, పార్ట్ బీగా విభజించినట్లు చెప్పారు. తొలి భాగం పార్ట్ ఏ ద్వారా తొలిసారి ఉద్యోగంలో చేరే యువతకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అంటే నెలవారీ సగటు వేతనం రూ.15 వేల వరకు ఉంటుంది. ఒక నెల జీతాన్ని అంటే రూ.15 వేల వరకు రెండు విడతల్లో ఉద్యోగికి చెల్లిస్తామని ఆయన తెలిపారు. రూ.1 లక్ష వరకు వేతనం అందుకుంటున్న ఉద్యోగులందరూ పార్ట్ ఏ కిందకే వస్తారని తెలిపారు.


ఇక పార్ట్ బీ కిందకు ఉపాధి కల్పించే కంపెనీలు వస్తాయి. కంపెనీ యజమానులకు మూడు శ్లాబులుగా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఉద్యోగి నెలవారీ శాలరీ రూ.10 వేల వరకు ఉంటే కంపెనీ యజమానికి రూ.1000 ప్రోత్సాహకం కింద వస్తాయి. అదే ఉద్యోగి నెల జీతం రూ.10-20 వేల మధ్య ఉంటే రూ.2 వేలు రూ.30 వేల వరకు ఉంటే రూ.3 వేల వరకు ఇస్తారు. ఒక ఉద్యోగికి ఒకసారి మాత్రమే ఇస్తారు. పార్ట్ బీలో ప్రతి అదనపు ఉద్యోగికి కంపెనీకి నెలకు గరిష్ఠంగా రూ.3 వేల వరకు అందుతాయి.


ఉద్యోగంలో చేరి ఆరు నెలల వరకు కొనసాగితే ఈ ప్రోత్సాహకం రెండు సంవత్సరాల పాటు ఇస్తారు. తయారీ రంగంలోని కంపెనీలు అయితే ఇది 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందుకు అర్హత సాధించాలంటే 50 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలు కనీసం ఇద్దరిని నియమించుకోవాలి. ఇక 50 మందికి పైగా ఉన్న సంస్థలు కనీసం 5 మందిని కొత్తగా నియమించుకోవాలి. వారు కనీసం ఆరు నెలలు కొనసాగాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa