ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీఆర్ గడువు మళ్లీ పొడిగింపు? కారణాలివే

business |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 11:09 PM

ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు గడువు సమీపిస్తోంది. ఇంకో 25 రోజులు మాత్రమే ఉంది. అయితే, ఇప్పటికీ కొన్ని ఎక్సెల్ యుటిలిటీలను విడుదల చేయలేదని, ఇప్పటి వరకు అందుబాటులోకి తెచ్చిన ఐటీఆర్ ఫారాలు, ఎక్సెల్ యుటిలిటీలు ఆలస్యం కావడం ట్యాక్స్ పేయర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మందిపు సంవత్సరం 2025-26కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు ప్రభుత్వం ఐటీఆర్ గడువును పొడిగించనుందా? అంటే తప్పనిసరిగా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్యాక్స్ పేయర్లు గడువు పెంచాలని కోరుతున్నారు.


ఐటీఆర్ గడువు దగ్గరపడుతున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లు, ట్యాక్స్ ప్రొఫెషనల్స్‌లో ఆందోళన సైతం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహా చాలా మంది పన్ను నిపుణులు ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ మరోసారి పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2025 వరకు ఉన్న గడువును పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్యాక్స్ పేయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు ఇచ్చిన గడువులోపు ఐటీ రిటర్నులు ఫైల్ చేయడం అనేది సాధ్యం కాదంటున్నారు.


ఈ క్రమంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి లేఖ రాసింది గుజరాత్ పారిశ్రామిక సంఘం జీసీసీఐ. ఐటీ రిటర్నుల గడువును మరోసారి పొడిగించాలని కోరింది. ఈసారి ట్యాక్స్ పేయర్లు, పన్ను నిపుణులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేసింది. ప్రధానంగా ఈ ఏడాది ఐటీఆర్ యుటిలిటీలు, ఫారాలను ఆలస్యంగా విడుదల చేయడమేనంటున్నారు. ఏప్రిల్ రెండో వారంలోపు రావాల్సిన ఐటీఆర్ యుటిలిటీలు, ఫారాలను ఏప్రిల్ చివరి నాటికి కొన్నింటిని మాత్రమే రిలీజ్ చేసింది. ఇప్పటికీ చాలా ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐటీఆర్- 5 యుటిలిటీ ఆగస్టు 8, 2025 తేదీన విడుదల చేశారు. దీంతో ఐటీఆర్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఇచ్చినట్లయింది.


ఇక సిస్టమ్ ఎర్రర్స్, లాగిన్ ఫెయిల్యూర్స్, టైమ్ ఔట్స్ వంటివి ఐటీఆర్ అప్లోడ్ చేస్తున్న సమయంలో ఎదురవుతున్న సమస్యలుగా జీసీసీఐ సూచించింది. అలాగే ట్యాక్స్ పోర్టల్‌లో ఆడిట్ రిపోర్ట్స్ సైతం ఉండడం లేదని తెలిపింది. అలాగే ఫారం 26 ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్ వంటి వాటిల్లోని వివరాల్లో తేడాలు ఉండడమూ ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు నుంచి నవంబర్ వరకు పలు పండగలు వస్తున్నాయి. ఇది ట్యాక్స్ ప్రొఫెషనల్స్ పనిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 15లోపు ఐటీ రిటర్నుల ఫైలింగ్ పూర్తి కాదని, మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa