ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త నేషనల్ హైవే.., బెంగళూరుకు 12 గంటలు కాదు 8 గంటల్లో వెళ్లొచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 06:12 PM

విజయవాడ నుంచి కడప మీదుగా బెంగళూరుకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి 544జీ పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే విజయవాడ-బెంగళూరు మధ్య దూరం దాదాపు 100 కిలోమీటర్లు తగ్గుతుంది.. ప్రయాణ సమయం కూడా 3 గంటలు ఆదా అవుతుంది. వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆరు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. ఈ హైవే అనంతపురం జిల్లాలోని కొడికొండ నుంచి ప్రారంభమై.. ప్రకాశం జిల్లా మీదుగా బాపట్ల జిల్లాలోని ముప్పవరం దగ్గర నేషనల్ హైవే 16లో కలిసేలా ప్లాన్ చేశారు. కొన్ని చోట్ల రహదారి పనులు పూర్తి అయ్యాయి.. మిగిలిన చోట్ల వేగంగా జరుగుతున్నాయి. అండర్‌పాస్‌లు, వంతెనలు కూడా స్పీడ్‌గా కడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రయాణం సులువు అవుతుందని భావిస్తున్నారు.


దీని కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాలు, మెట్రో నగరాలను కలపడమే దీని లక్ష్యం. ఈ రహదారి 2026 జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ద్వారా విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణ సమయం తగ్గుతడంతో పాటుగా పారిశ్రామికవాడలు, పెద్ద నగరాలను కలుపుతుంది. ఈ హైవేలో కేవలం 13 చోట్ల మాత్రమే ప్రవేశించేందుకు వీలుంది. విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూ సేకరణ చేయగా.. ఈ హైవే నిర్మాణం చేస్తున్న జిల్లాల్లో చాలా మంది రైతులకు ఇంకా పరిహారం అందలేదు అంటున్నారు.


కడప జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె, శ్రీరాములపేట, తిప్పిరెడ్డిపల్లె గ్రామాల్లో రైతులు పనులు ఆపారు. తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టా భూములు ఉన్నా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. భూములు ఆన్‌లైన్‌లో ఉన్నాయని, పన్ను కూడా కడుతున్నామన్నారు. ఈ భూముల అంశంపై తహసీల్దారు రమాకుమారి స్పందించారు. పరిహారం అందనివారి దస్త్రాలు సిద్ధం చేశామన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రైతులు మాత్రం తమకు త్వరగా పరిహారం అందాలని కోరుతున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా పలువురు రైతులకు పరిహారం అందలేదంటున్నారు.. ఇటీవల పనుల్ని అడ్డుకున్నారట.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa