భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లు రష్యా నుంచి తిరిగి క్రూడాయిల్ కొనుగోలు ప్రారంభించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మాస్కో భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేయడంతో సెప్టెంబరు, అక్టోబరు కోసం చమురు కొనుగోలు మొదలుపెట్టాయని ఈ రెండు కంపెనీలకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఇంధనం దిగుమతులను తిరిగి ప్రారంభించడంతో రష్యా ఆయిల్ కొనుగోలుదారుల్లో అగ్రగామి చైనాకు సరఫర తగ్గొచ్చని భావిస్తున్నారు. భారత కంపెనీలు ఆయిల్ దిగుమతులు నిలిపివేసిన సమయంలో బీజింగ్ కొనుగోళ్లను పెంచింది.
తక్కువ మొత్తం డిస్కౌంట్, ఆయిల్ కొనుగోలు విషయంలో భారత్పై అమెరికా విమర్శలు చేయడంతో చమురు కంపెనీలు రష్యా క్రూడాయిల్ దిగుమతులను జులై నుంచి నిలిపివేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై ట్రంప్ 50 శాతం సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఆగస్టు 1న ప్రకటించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రాగా.. ఆగస్టు 7న ప్రకటించిన మరో 25 శాతం టారీఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం ముగించడానికి విముఖంగా ఉన్న రష్యాపై ఒత్తిడి పెంచడానికే తాము భారత్ ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు విధించినట్టు అమెరికా తెలిపింది.
రష్యా సంస్థ ఉరల్ ముడి చమురుపై డిస్కౌంట్లను బ్యారెల్కు దాదాపు 3 డాలర్లకు పెంచడంతో భారత కంపెనీలకు అవకాశంగా మారిందని, ఇదే సమయంలో చైనా కూడా కొనుగోళ్లను పెంచిందని అధికారులు తెలిపారు. ఉరల్తో పాటు IOC వరండే, సైబీరియన్ లైట్ వంటి ఇతర రష్యా చమురు కంపెనీల నుంచి కూడా కొనుగోలు చేసిందని వారు తెలిపారు. అయితే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై భారత కంపెనీలు మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, దేశీయ చమురు దిగ్గజం IOC మాత్రం ఆర్థిక ప్రయోజనాలను అనుసరించి రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తామని సోమవారం తెలిపింది. ఇటీవల వారాల్లో చైనా రిఫైనరీలు అక్టోబరు, నవంబరు సరఫరా కోసం 15 కార్గోలు రష్యా క్రూడాయిల్ కొనుగోలుచేసిన విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా సుంకాలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అన్యాయమని, ఏకపక్ష చర్యలని మండిపడింది. అంతేకాదు, భారత్ వస్తువులను అమెరికా మార్కెట్లోకి రావడం అపేస్తే తామే కొనుగోలు చేస్తామని రష్యా ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం దిశగా సాగుతున్నట్టు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa