ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సీఎంపై దాడికి ముందు నుంచే ప్లానింగ్.. సీసీటీవీ ఫుటేజీలో భయంకర నిజాలు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 05:18 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం రోజు ఉదయం జరిగిన దాడి కేవలం ఆవేశంతో చేసిన చర్య కాదని తేలిపోయింది. కావాలాని పక్కా ప్రణాళికతో అతడు సీఎంపై దాడికి పాల్పడినట్లు తాజా విచారణలో వెల్లడి అయింది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ..ఈ ఘటనకు 24 గంటల ముందే ముఖ్యమంత్రి నివాసంపై రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజీలు, పోలీసు విచారణలో బయటపడింది. అయితే 41 ఏళ్ల నిందితుడు రాజేశ్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియా.. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వచ్చాడు.


తన బంధువు ఒకరు జైలులో ఉన్నారని, వారిని విడిపించమని కోరడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తను కలిసేందుకు ప్రయత్నించాడు. అతను ముఖ్యమంత్రిని కలవడానికి ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకున్నాడు. రాత్రిపూట ఆమె నివాసానికి సమీపంలో గడిపి.. ఆమె కదలికలను నిశితంగా పరిశీలించాడు. ఈ వివరాలను స్వయంగా ఢిల్లీ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ వెల్లడించారు. "ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి 24 గంటల పాటు రెక్కీ నిర్వహించాడు. సాలీమార్ బాగ్‌లోని సీఎం రేఖా గుప్తా నివాసాన్ని కూడా పరిశీలించాడు. నిన్న రాత్రి సివిల్ లైన్స్ ప్రాంతంలోనే ఉండి.. ఈ రోజు ఉదయం ఆమెను కలవడానికి వచ్చాడు. అతని చేతిలో ఏ పత్రాలూ లేవు, ఆమెను కలిసిన వెంటనే దాడి చేశాడు," అని పర్వేష్ సాహిబ్ సింగ్ తెలిపారు.


ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 'జన్ సునాయి' కార్యక్రమంలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. వాటిలో నిందితుడు పలు గంటలపాటు ముఖ్యమంత్రి నివాసం చుట్టూ తిరుగుతూ, పరిసరాలను గమనిస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు రిక్షా కార్మికులకు డబ్బు ఇస్తూ.. మరికొన్నిసార్లు నీరు తాగుతూ అతను అక్కడే ఉన్నట్లు ఫుటేజీలో నమోదు అయింది. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ప్రారంభంలో ముఖ్యమంత్రిపై చేయి చేసుకున్నారని లేదా ఒక వస్తువు విసిరారని వార్తలు వచ్చాయి. కానీ ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ ఆరోపణలను ఖండించారు. నిందితుడు ముఖ్యమంత్రికి కొన్ని పత్రాలు ఇచ్చి.. ఆ తర్వాత ఆమె చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటనతో ఆమె చాలా ఆందోళనకు గురయ్యారని.. చిన్నపాటి గాయాలు అయినప్పటికీ.. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే క్యాంపు కార్యాలయంలో భద్రతను మరింత పెంచారు. ఈ ఘటనపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం అందించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa