ఆసియాకప్ 2025కి ముందు టీమిండియాకు గుడ్న్యూస్. ఆసియాకప్ 2025 జట్టుకు ఎంపికైన ఫినిషర్ రింకూ సింగ్.. సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న టీ20 లీగ్లో ఆడుతున్న అతడు.. సూపర్ సెంచరీతో రఫ్పాడించాడు. 48 బంతుల్లోనే 8 సిక్స్లు, 7 ఫోర్లతో 108 రన్స్ స్కోరు చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో రింకూ సింగ్ జట్టు మరో ఏడు బంతులు ఉండగానే గెలుపొందింది.
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో రింకూ సింగ్ .. మేరట్ మావెరిక్స్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు గోరఖ్పూర్తో మ్యాచ్ ఆడింది. లక్నో స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్పూర్ జట్టు.. మేరట్ మావెరిక్స్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మేరట్ టీమ్.. రింకూ సింగ్ విధ్వంసంతో ఈజీగా గెలుపొందింది. ఛేదనలో రింకూ సింగ్.. అదరగొట్టాడు. ఏడా పెడా ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
168 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన మేరట్ టీమ్.. ఓ దశలో 38 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్.. చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగించాడు. ఈ క్రమంలోనే మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా వాసు వాట్స్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 45 బంతుల్లోనే రింకూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 48 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు.
తాజాగా ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రింకూ సింగ్ చోటు సంపాదించాడు. మరో 20 రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుండగా.. ఇలాంటి సమయంలో రింకూ ఫామ్లోకి రావడం భారత్కు కలిసొచ్చే అంశం. ఆసియాకప్లో టీమిండియా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత 14న పాకిస్థాన్, 19న ఒమన్తో తలపడనుంది. లీగ్ స్టేజ్ ముగిశాక సూపర్-4, ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa