ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎం కొత్త రూల్స్.. ఇక ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.23 ఛార్జ్

business |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 10:56 PM

బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డు (ఏటీఎం) కార్డులు ఉంటాయి. నగదు అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లకుండా సమీపంలోని ఏటీఎం ద్వారా తీసుకుంటారు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో సైతం నగదు తీసుకోవచ్చు. అయితే, ఇష్టం వచ్చినన్ని సార్లు నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బ్యాంకింగ్ సేవలు ఉచితంగా వినియోగించుకునేందుకు లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం ఏటీఎం ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో ట్రాన్సాక్షన్‌కి గరిష్ఠంగా రూ. 23 వరకు వసూలు చేయనున్నారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


ఆర్‌బీఐ కొత్త రూల్స్ ప్రకారం హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎం ద్వారా ఒక నెలలో 3 ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉచితంగా నిర్వహించవచ్చు. ఇక నాన్ మెట్రో ప్రాంతాల్లో ఈ లిమిట్ 5గా ఉంది. ఈ లిమిట్ దాటితే పీఎఫ్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ వండి బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఎస్‌బీఐ పాత ఛార్జీలనే వసూలు చేస్తుండడం కాస్త ఊరట కల్పించే విషయం. చాలా బ్యాంకులు కొత్త ఛార్జీలకు మారిపోయాయి.


ఉచిత పరిమితిలో క్యాష్ విత్ డ్రా సహా బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ మార్పు వంటి ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి. అయితే, క్యాష్ రిసైక్లర్ మెషన్ ద్వారా నగదు జమ చేయడం అనేది ఉచితం. కానీ, ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ అనేది లిమిట్ దాటితే ఛార్జీలు పడతాయి. ఇవి బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఒక సారి మీరు లిమిట్ దాటిన తర్వాత ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే అదనపు లావాదేవీలు ఒక్కో దానిపై రూ. 23 ప్లస్ జీఎస్‌టీ ఛార్జ్ చేస్తాయి బ్యాంకులు. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో లిమిట్ దాటిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే రూ. 23 ఛార్జ్ పడుతుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అయితే రూ. 11 కట్టాల్సి వస్తుంది.


ఏటీఎం నిబంధనలను పక్కనబెడితే బ్యాంక్ ఖాతాలో నగదు ట్రాన్సాక్షన్లకూ పరిమితి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి రూ. 20 లక్షలు ఆపైన డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా పాన్, ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లావాదేవీల వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం చేతికి వెళ్తాయి. నల్లధనాన్ని అరికట్టి బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ పరిమితిని విధించారు. అందుకే ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి. తమ ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎంలలోనే నగదు విత్ డ్రా చేయడం మంచిది. అదనపు ఛార్జీలు పడకుండా చూసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa