దేశవ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణనాథుడు కొలువుదీరనున్నాడు. ఇక గణేష్ పండుగ సందర్భంగా యువత హడావిడి చెప్పనక్కర్లేదు. వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి.. మండపాలకు తీసుకెళ్లే సమయంలోనూ గణేష్ ఆగమనం అంటూ.. ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి. వినాయకుడి విగ్రహాలు, మండపాల ఏర్పాటు కోసం ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో వేగంగా అనుమతులు జారీ చేస్తున్నారు. https:///ganeshutsav.net అనే వెబ్సైట్ ద్వారా వినాయకుడి మండపాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.
వినాయకుడి విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https:///ganeshutsav.net వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ, అడ్రస్, అసోసియేషన్ లేదా కమిటీ పేరు వంటి వివరాలు పొందుపరచాలి. అలాగే వినాయకుడి మండపం స్థలం, గణేష్ విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వంటి వివరాలు తెలియజేయాలి. విగ్రహం ఏర్పాటుచేసే ప్రాంతం ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలతో పాటుగా.. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లను, వారి ఫోన్ నంబర్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనం ఏరోజు, ఎన్ని గంటలకు చేస్తారు, ఎలాంటి వాహనం వినియోగిస్తున్నారనే దానికి సంబంధించిన పూర్తి చేసి వివరాలు నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు. ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్వోసీ డౌన్ లోడ్ చేసుకోవడానికి https:///ganeshutsav.net/application Status లోకి వెళ్లారు. అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఎన్ఓసీతో పాటుగా నిబంధనలతో కూడిన క్యూఆర్కోడ్ వస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని.. లామినేషన్ చేయించి వినాయకుడి మండపంలో ఉంచాలి. వినాయకుడి మండపం తనిఖీకి వచ్చే అధికారులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను పరిశీలిస్తారని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు పోలీసుల అనుమతి లేకుండా గణేశుడి విగ్రహాలు, పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు. అనుమతుల జారీ ప్రక్రియ పూర్తి ఉచితంగా చేపడుతున్నారు. అలాగే వినాయకుడి విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఎక్కువ సౌండ్ వచ్చే సిస్టమ్లు, డీజేలు ఉపయోగించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే వినాయకుడి మండపాల ఏర్పాటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై సందేహాలు ఉంటే.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
వినాయకుడి మండపాల ఏర్పాటు కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖ, పంచాయతీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీటిని పరిశీలించి.. ఆ మండపానికి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తారని అధికారులు చెప్తున్నారు. మండపాల వద్ద ఏ ఘటనలు జరిగినా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే ప్రైవేటు స్థలంలో విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి వస్తే.. స్థల యజమాని నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa