అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా.. ఇటీవల తన యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి ఇండియాకు వచ్చారు. నాసాకు చెందిన ఆక్సియమ్-4 (AX-4) మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆయన.. తన అసాధారణమైన అనుభవాలను తాజాగా భారత ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి భారతదేశాన్ని చూసినప్పుడు 'నిజంగా చాలా అందంగా' కనిపించిందని చెప్పారు.
ఢిల్లీలో జరిగిన 'గగన్ యాత్రల అభినందన సభ'లో పాల్గొన్న శుభాన్షు శుక్లా.. తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత దేశాన్ని వీడియో తీశానని.. ఆ దృశ్యం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ముఖ్యంగా రాత్రిపూట హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు భారత దేశం ప్రత్యేకమైన ఆకారం, రాత్రిపూట వెలిగే నగరాల కాంతులు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయని తెలిపారు. ఆ దృశ్యం ఏ వ్యోమగామి అయినా చూడగలిగే అత్యంత అందమైన దృశ్యాలలో ఒకటిగా తాను భావిస్తున్నానని చెప్పారు.
ఆయన తన ప్రసంగంలో గురుత్వాకర్షణ లేని అంతరిక్ష వాతావరణంలో జీవితం ఎలా ఉంటుందో వివరించారు. 'అంతరిక్షం నుంచి మన భూమిని చూడడం ఒక విలక్షణమైన అనుభూతినిస్తుంది. భూమిని తలక్రిందులుగా చూసినప్పుడు, ఆక్సిజన్ కారణంగా అది పచ్చని కాంతితో మెరిసిపోతూ కనిపించింది' అని ఆయన వివరించారు. ఈ ప్రెజెంటేషన్లో ఆయన బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఎలా స్పష్టంగా కనిపించాయో చిత్రాలతో సహా చూపించారు. అంతరిక్షంలో ప్రతిరోజూ 16 సార్లు సూర్యోదయాన్ని చూసే అవకాశం లభిస్తుందని.. ఆ దృశ్యం చూసి తాను ఎప్పుడూ అలసిపోలేదని తెలిపారు.
శుభాన్షు శుక్లా అంతరిక్షయానం భారత దేశానికి అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ మిషన్లో ఆయన పైలట్గా కీలక పాత్ర పోషించారు. క్రూ డ్రాగన్ సిస్టమ్స్తో సమన్వయం చేసుకుంటూ.. భారతీయ పరిశోధకులు రూపొందించిన శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగాలు గగన్యాన్ మిషన్ వంటి భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా తన యాత్రను 'మొత్తం దేశం యొక్క మిషన్'గా అభివర్ణించారు. భారతదేశ ప్రజల కలలు, ఆశలు తనతో పాటు అంతరిక్షంలోకి వెళ్లాయని ఆయన అన్నారు. ఈ ప్రయాణం యువతలో సైన్స్, టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారతదేశం వేగంగా పురోగమిస్తున్న తరుణంలో.. శుభాన్షు శుక్లా వంటి వ్యోమగాముల అనుభవాలు దేశ భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa