భారత రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా ఉంటాయి. ప్రజాకర్షణ కోసం నాయకులు కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. తాజాగా బిహార్లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు.. దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భారత కూటమి నాయకులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి.. బుల్లెట్ బైకుపై ప్రయాణించారు. తమ 'ఓటర్ అధికార్ యాత్ర'కు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.
రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్లు కలిసి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఈ యాత్రను ప్రారంభించారు. ఓటర్ల జాబితాను సరిచేయాలని, అర్హత ఉన్న ఓటర్లు అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 16 రోజుల పాటు ఈ యాత్ర సుమారు 1,300 కిలో మీటర్ల మేర సాగనుంది. ఆగస్టు 17న ససారామ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మొత్తంగా 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ.. సెప్టెంబర్ 1న పట్నాలో భారీ బహిరంగ సభతో ముగియబోతుంది.
ఈయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ అరేరియాలోకి ప్రవేశించగా.. వారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కలిసి బుల్లెట్ బైక్లపై ప్రయాణించారు. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీలు బైక్ నడుపుతుండగా.. వెనుక కార్యకర్తలు కూర్చున్నారు. ఇద్దరు నాయకులు ఒకరి వెనుక మరొకరు బైక్పై వెళ్లడం చూసిన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జాతీయ స్థాయిలో ఈ యాత్రకు మరింత ప్రచారం లభించింది. వీరు ప్రయాణించిన మార్గాల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ఈ బైక్ యాత్రకు విమర్శలు కూడా వచ్చాయి. జైలులో ఉన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ బహిష్కృత ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ బైక్ యాత్రపై ఘాటుగా స్పందించారు. బీజేపీకి చెందిన పలువురు నాయకులు కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం ప్రచారం కోసమే ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఈ బైక్ రైడ్ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ యాత్ర బిహార్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. మొత్తంగా ఈ బైక్ రైడ్ 'ఓటర్ అధికార్ యాత్ర'కు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ప్రజల్లోకి చొచ్చుకుపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa