ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరకట్న మరణం కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 05:31 PM

ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పోలీసులు సంచలనం సృష్టించారు. వరకట్న వేధింపుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నిఖీ భర్త విపిన్‌.. పోలీసుల అదుపులో ఉండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు కాలికి బుల్లెట్ గాయాలు కాగా.. ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే.. తనకు భార్య హత్యతో ఎలాంటి సంబంధమూ లేదని చెబుతున్నాడు. అందరి ఇళ్లల్లో భార్యాభర్తలు తగువులాడుకుంటారని.. తమది కూడా అలాంటి గొడవేనని చెప్పాడు. ఈక్రమంలోనే నిఖీయే ఆత్మహత్య చేసుకుందని వివరిస్తున్నాడు.


గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో నిఖీ అనే మహిళను ఆమె భర్త, అత్తమామలు కలిసి కట్నం కోసం దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యాకాండకు నిఖీ ఐదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. 'అమ్మను నాన్నే లైటర్‌తో కాల్చి చంపేశారు' అని ఆ చిన్నారి చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా అందరినీ కలచివేశాయి. ఆ కేసులో నిఖీ భర్త విపిన్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవడానికి అతడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.


అయితే విపిన్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడిని సిర్సా చౌరహా సమీపంలోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నిఖీని చంపడానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు అక్కడకు తీసుకెళ్లగా.. విపిన్ పోలీసుల కళ్లు గప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలోనే ఒక పోలీసు అధికారి వద్ద ఉన్న పిస్టల్‌ను లాక్కోవడానికి కూడా యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు పదేపదే హెచ్చరించినా విపిన్ ఆగకుండా పారిపోవడానికి ప్రయత్నించగా.. గత్యంతరం లేక పరిస్థితుల్లో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.


ఈక్రమంలోనే ఓ బుల్లెట్ విపిన్ కాలికి తగలడంతో కింద పడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మీడియా ప్రతినిధులు అతడిని సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు. ఈక్రమంలోనే అతడు తానేమీ నిఖీని చంపలేదని.. అందరి ఇళ్లళ్లో అయినట్లుగానే తమ ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని వివరిస్తున్నాడు. అయితే ఈ గొడవ తర్వాత నిఖీ తనంతట తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని.. తామే దగ్గరుండి ఆస్పత్రిలో చేర్పించామని వివరిస్తున్నాడు. కావాలనే తనను ఇరికిస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు.


మరోవైపు ఈ ఘటనపై స్పందించిన నిఖీ తండ్రి.. పోలీసులు సరైన పని చేశారని పేర్కొన్నారు. 'నేరస్థులు ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే పోలీసులు తప్పకుండా కఠినంగా వ్యవహరించాలి' అని అన్నారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరారు. ఈ ఘటనతో గ్రేటర్ నోయిడాలో కట్నం హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని కాలికి కాల్చి పట్టుకోవడంపై పోలీసులు అభినందనలు అందుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa