ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి ఓఆర్ఆర్‌పై కీలక అప్‌డేట్.. భూముల సర్వే నెంబర్ల ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 07:18 PM

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించగా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూముల సర్వే నంబర్లను ఖరారు చేశారు. ఓఆర్ఆర్ కోసం ఇప్పటికే భూములను గుర్తించిన రెవెన్యూ అధికారులు.. గుర్తించిన సర్వే నంబర్లలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను అపేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఆ ప్రాంతాల్లో భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది.


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములను గుర్తించారు. సర్వే నంబర్లను గుర్తించి, రిజర్వు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి రావటంతో ప్రక్రియ నిలిచిపోయింది. అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో అప్పటి నివేదికల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి భూముల జాబితాను రూపొందించి.. కాంపిటేట్ అథారిటీగా జాయింట్ కలెక్టర్‌ను నియమించారు.


ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నాలుగు మండలాల మీదుగా వెళ్తుంది. ఈ నాలుగు మండలాలోని 18 గ్రామాలలో భూసేకరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి భూమిని సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ కోసం గుర్తించిన సర్వే నంబర్లలో లేఔట్లు వేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సర్వే నంబర్లలో లేఔట్లు, నాలా ఫీజులు చెల్లించుకోవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో 180 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రణాళికలు రచించగా.. ఇటీవల140 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదనపు 70 మీటర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వ్యయంలో ఏపీ సర్కారు రూ.1000 కోట్లు భరించనుంది.


అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి ఓఆర్ఆర్ వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెంచాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa