ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా న్యూక్లియర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి

international |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 09:42 PM

పశ్చిమ కుర్స్క్‌లోని తమ అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ 34 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాత్రంతా దాడులు కొనసాగిస్తూనే ఉందని పేర్కొంది. ఈ దాడుల్లో పలు విద్యుత్, ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుందని రష్యా అధికారులు తెలిపారు. కుర్స్క్‌లోని అణు విద్యుత్ కేంద్రంపై దాడి తర్వాత చెలరేగిన మంటలను తక్షణమే స్పందించి ఫైర్ రెస్క్యూ సిబ్బంది అదుపుచేశారని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ప్లాంట్ ప్రెస్ సర్వీస్ టెలిగ్రామ్ యాప్‌లో పోస్ట్ చేసింది. ఈ దాడిలో ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిందని, రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్టు తెలిపింది.


  ఈ ఘటనపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ సైతం స్పందించింది. ‘సైనిక చర్యల కారణంగా రష్యాలోని కుర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ మంటల్లో చిక్కుకున్న విషయం మీడియా నివేదికల ద్వారా తెలిసింది.. కానీ, స్వతంత్రంగా ధ్రువీకరించడానికి మాకు ఎటువంటి సమాచారం లేదు’ అని పేర్కొంది. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాస్సి మాట్లాడుతూ.. ప్రతి అణు కేంద్రాన్ని అన్ని సమయాల్లో రక్షించాలని అన్నారు. అయితే, ఈ దాడుల ఆరోపణలపై ఉక్రెయిన్ తక్షణమే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.


రష్యా అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం లెనిగ్రేడ్ రీజియన్‌లోని ఉస్ట్-లుగా పోర్ట్‌లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది సకాలంలో అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. 10 ఉక్రెయిన్ డ్రోన్లు పోర్టుపై దాడిచేసినట్టు ఈ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తమ భూభాగంలో 95 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేరకొంది.


మరోవైపు, రష్యా 72 డ్రోన్లు, డెకాయ్‌లు, క్రూయిజ్ క్షిపణులతో దాడిచేసినట్టు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. అందులో 48 డ్రోన్లు కూల్చడం లేదా జామ్ చేసినట్టు పేర్కొంది. 1991 ఆగస్టు 23న సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ.. కీవ్ ఇండిపెండెంట్ కూడలి నుంచి వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ.. దేశం సంకల్పాన్ని నొక్కి చెప్పారు. ‘భద్రత, శాంతితో జీవించడానికి తగినంత బలం, శక్తి ఉన్న ఉక్రెయిన్‌ను మేము నిర్మిస్తున్నాం’ అని జెలెన్స్కీ న్యాయమైన శాంతి కోసం పిలుపునిచ్చారు.


‘‘మా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మా ఇష్టం’ అని ఆగస్టు ప్రారంభంలో అలాస్కాలో జరిగిన అమెరికా-రష్యా శిఖరాగ్ర సమావేశానికి ముందు జెలెన్‌స్కీ అన్నారు. ‘ఈ శిఖరాగ్ర సమావేశంలో ఉక్రేయిన్.. ఐరోపా ప్రయోజనాలను పక్కన పెడతారని చాలామంది భయపడ్డారు. ప్రపంచానికి ఇది తెలుసు.. ప్రపంచం దీనిని గౌరవిస్తుంది. ఇది ఉక్రెయిన్‌ను గౌరవిస్తుంది. ఇది ఉక్రెయిన్‌ను సమానంగా భావిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa