వివాహేతర సంబంధం ఓ మహిళ నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియుడితో కలిసి లాడ్జికి వెళ్లిన వివాహిత.. అతడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇరువురి మధ్య వాగ్వాదంతో మొదలై చివరకు ఆమె నోట్లో జిలిటెన్ స్టిక్స్ పెట్టి పేల్చేసే దాకా వెళ్లింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. దారుణమైన ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 22 ఏళ్ల వివాహితను ఆమె ప్రియుడు నోటిలో పేలుడు పదార్థం పేల్చి దారుణంగా హత్య చేశాడు. బెడ్పై రక్తపు మడుగులో మహిళ మృతదేహం పడి ఉన్న భయానక వీడియోలో ఆమె ముఖం కింది భాగం పూర్తిగా పేలిపోయి ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. హోసూర్ తాలూకా గేరాసానాహళ్లికి చెందిన రక్షిత (202, ఆమె ప్రియుడు సిద్దరాజు (22) బెహెర్యా పట్టణంలో సోమవారం ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం కాగా.. బంధువైన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇరువురి మధ్య గత ఆరేళ్లుగా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ లాడ్జిలో దిగి ఏకాంతంగా ఉన్న సమయంలో గొడవ మొదలైంది. దీంతో ఆవేశంలో తన వెంట తెచ్చుకున్న పేలుడు పదార్థాన్ని ఆమె నోటిలో ఉంచి, క్వారీలలో జిలిటిన్ స్టిక్స్ పేల్చడానికి ఉపయోగించే ట్రిగ్గర్ ఉపయోగించి పేల్చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఆమె చనిపోవడంతో ఘటనపై ఇతరులను నిందితుడు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మొబైల్ ఫోన్ పేలిపోవడంతో ఆమె చనిపోయిందని కట్టుకథ అల్లాడు. అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో ఆధారాలను బట్టి ఆమెను గేరాసానాహళ్లికి చెందిన రక్షితగా గుర్తించారు. నిందితుడు సిద్ధరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇరువురి మధ్య గొడవకు కారణం ఏంటి? ముందుగా వేసిన పథకం ప్రకారమే హత్య చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తులో వివరాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa