ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమశిల చూపిస్తానంటూ తీసుకెళ్లి భార్యను కాల్చేసిన భర్త

Crime |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 10:34 PM

అక్రమ సంబంధాలు, అనుమానాలు, మనస్పర్థలతో భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలు చివరకు ప్రాణాలు తీసేదాకా వెళ్తున్నాయి. హైదరాబాద్‌ బోడుప్పల్‌లో భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి ముక్కలు ముక్కలు చేసి మూసీ నదిలో విసిరేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐదు నెలల గర్భిణీ అని చూడకుండా భర్త మహేందర్ రెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మరవక ముందే తాజా.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. సోమశిల చూపిస్తానంటూ భార్యను నమ్మించి తీసుకెళ్లిన ఓ భర్త.. నిర్మానుష్య అటవీ ప్రాంతంలో ఆమెను చంపి, ఆపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఈ దారుణం నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది.


 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మహబూబ్ నగర్‌కు చెందిన శ్రావణిని పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక బాబు, ఒక పాప సంతానం. కొంతకాలం వారి వైవాహిక జీవితం సవ్యంగానే సాగినా.. ఇటీవల ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయి. దీంతో శ్రావణి తన పిల్లలతో కలిసి మహబూబ్ నగర్‌లోని పుట్టింటికి వెళ్లి ఉంటోంది. ఈ నెల 21న భర్త శ్రీశైలం మహబూబ్ నగర్ వెళ్లి శ్రావణిని కలిశాడు. సోమశిల పుణ్యక్షేత్రానికి వెళ్దామని మాయమాటలు చెప్పి ఆమెను తన బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో శ్రీశైలం ఆమెను పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడు మాన్ దీన్నే అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అప్పటికే తన భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న శ్రీశైలం.. అక్కడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి ఆమె శరీరాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.


శ్రీశైలంతో వెళ్లిన తన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి తండ్రి మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట కుంటిసాకులు చెప్పిన శ్రీశైలం.. పోలీసుల గట్టి విచారించటంతో నేరాన్ని అంగీకరించాడు. తానే శ్రావణిని చంపానని ఒప్పుకోవడమే కాకుండా.. హత్య చేసిన స్థలాన్ని కూడా పోలీసులకు చూపించాడు. శ్రావణి తండ్రి ఫిర్యాదు ఆధారంగా మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa