ఆ ఊరిలో శివయ్యకు ఆలయం నిర్మించేందుకు విరాళాలు కోరితే ఎవరూ ముందుకు రాలేదు. ఓ బామ్మ మాత్రం ముందుకొచ్చారు.. తన పెద్ద మనసు చాటుకున్నారు. తన భూమిని అమ్మేసి మరీ భారీ విరాళం ఇచ్చారు.. శివుడిపై భక్తిని చాటుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం బాలసముద్రంలో జంబులింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేయాలని స్థానికులు నిర్ణయించారు. కానీ నిధుల సమస్య ఎదురైంది.. ఎవరూ సాయం చేయడానికి ముందుకురాలేదు. అప్పుడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే వృద్ధురాలు ముందు కొచ్చారు. అర కోటికిపైగా విరాళం ఇచ్చారు.
లక్ష్మీనారాయణమ్మ భర్త అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోగా.. ఒక్కగానొక్క కుమార్తెకు అంగవైకల్యం.. ఆమె కూడా 30 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మీనారాయణకు కొక్కంటి క్రాస్ సమీపంలో విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. అయితే ఆలయ నిర్మాణానికి నిధుల కొరత సమస్య వెంటాడుతుందని తెలిసి లక్ష్మీనారాయణమ్మ వెంటనే స్పందించారు. తన విలువైన ఆస్తుల్ని అమ్మి మరీ జంబులింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారు. ఏకంగా ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చులో దాదాపు 70 శాతంపైగా నిధులు అందించారని చెబుతున్నారు. దాదాపు రూ.అరకోటి వరకు ఇచ్చారట.
లక్ష్మీనారాయణమ్మ ఇచ్చిన విరాళానికి మరికొందరు దాతల నుంచి నిధులు సేకరించి జంబులింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఆలయంలో శివుడు, పార్వతిదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలను స్థానికులు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో స్వామివారు ముక్కంటీశుడిగా ప్రతిరోజూ పూజలు అందుకుంటున్నారు. ఆలయ నిర్మాణ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీనారాయణమ్మ జంబులింగేశ్వరస్వామి ఆలయం దగ్గరే ఉంటున్నారు. తనకంటూ కుటుంబంలో ఎవరూ లేరని.. ఆ శివయ్యకు ఆలయం నిర్మించాలనే కోరిక ఉండేదన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక.. ఆ శివయ్య నిత్యం పూజలు అందుకుంటున్నారని.. ఇప్పుడు తన మనసు కుదుటపడిందని చెబుతున్నారు లక్ష్మీనారాయణమ్మ. తనకున్న ఆస్తిని అమ్మేసి మరి ఆలయానికి విరాళం ఇచ్చిన బామ్మను అందరూ అభినందిస్తున్నారు. ఆమె ఆ శివయ్యకు ఆలయాన్ని నిర్మించడంతో కల నెరవేరింది.. ఆ ఆలయం దగ్గరే ఉంటూ స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa