ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవిత్ర కొలనులో కాళ్లు కడిగిన యూట్యూబర్.. సంప్రోక్షణకు నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 05:30 PM

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, యూట్యూబర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్తూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా గుడులు, గోపురాల వద్దకు వెళ్లి రీల్స్, డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అచ్చంగా ఇలాగే చేసి వివిదాలపాలైందో యూట్యూబర్. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ దేవస్థానం వద్ద ఈ సంఘటన జరిగింది. ఒక మహిళా వ్లాగర్ ఆలయానికి చెందిన పవిత్ర కొలనులో తన కాళ్లు కడుక్కుంటూ వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ చర్యను ఆలయ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఓవైపు పోలీసులకు ఫిర్యాదు చేసి మరోవైపు కొలనును శుద్ధి చేయడానికి పవిత్రీకరణ కార్యక్రమం ('పుణ్యాహం') నిర్వహించాలని నిర్ణయించారు.


పవిత్ర కొలనులో కాళ్లు కడిగిన వ్లాగర్ పేరు జాస్మిన్ జాఫర్. ఈమె గతంలో బిగ్‌బాస్‌ షోకు కూడా వెళ్లింది. అయితే ఈమె తాజాగా గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆగస్టు 20వ తేదీన అక్కడే 'రుద్రతీర్థం' అనే పవిత్ర కొలనులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. ఆపై దాన్ని రీల్‌గా మార్చుకుని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఇదంతా బాగానే ఉండగా.. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆరాట్టు, విగ్రహామూర్తులకు ఈ పవిత్ర కొలనులో స్నానం చేయిస్తుంటారు. అందుకే భక్తులకు నిషిద్ధం. కానీ ఇదేమీ తెలియని వ్లాగర్ జాస్మిన్ నేరుగా ఆ కొలనులోకి వెళ్లి కాళ్లు కడుక్కుంది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పెట్టగా అది కాస్తా వైరల్ అయింది.


ఇది చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వీడియోను ఆలయ అధికారులకు పంపించారు. అది చూసిన ఆలయ అర్చకులు జాస్మిన్‌పై మండిపడ్డారు. ఆమె చేసిన పని సంప్రదాయాలకు విరుద్ధమని, ఇది కొలను పవిత్రతను దెబ్బతీసిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ వివాదంపై స్పందించిన గురువాయూర్ దేవస్థానం.. కొలనును తిరిగి పవిత్రం చేయడానికి ఒక ప్రత్యేక శుద్ధి ('పవిత్రీకరణ') కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని 'పుణ్యాహం' అని పిలుస్తారు. ఈ చర్య ద్వారా పవిత్రతను పునరుద్ధరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.


అంతేకాకుండా ఒక వ్లాగర్ ఈ విధంగా ఆలయ నియమాలను ఉల్లంఘించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువాయూర్ దేవస్థానం మేనేజింగ్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసుకున్నారు. వివాదం తీవ్రం కావడంతో వ్లాగర్ జాస్మిన్ జాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోను తొలగించింది. ఆమె తన చర్యకు క్షమాపణలు కూడా చెప్పింది. పవిత్రమైన ప్రదేశంలో అలా చేయడం తన ఉద్దేశం కాదని.. అది పొరపాటున జరిగిందని ఆమె వివరించింది. అయినప్పిటీ ఆలయ అర్చకులు, భక్తులు ఆమె చర్యపై అసంతృప్తిగానే ఉన్నారు. సంప్రోక్షణ తర్వాత ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa