ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రిక్ బైక్స్‌పై రూ.20000 ఆఫర్.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన స్టాక్

business |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 11:01 PM

ఎనర్జీ సెక్టార్‌కు చెందిన ప్రముఖ కంపెనీ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ అదరగొట్టింది. అమెరికా సుంకాల భయాలతో ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోగా ఈ స్టాక్ మాత్రం దూసుకెళ్లింది. ఒక్కరోజే 10 శాతానికి పైగా పెరిగింది. దీంతో నాలుగు వారాల గరిష్ఠ స్థాయి రూ.58.25ను తాకింది. స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈలో మొత్తంగా 72.8 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. వారం సగటు విలువ 2.7 మిలియన్ షేర్లతో పోలిస్తే 27 రెట్లు పెరగడం గమనార్హం. ఈ స్టాక్ పెరిగేందుకు ఓ ప్రధాన కారణం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.


రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ఇటీవల చేసిన ఓ ప్రకటన స్టాక్ ర్యాలీకి కారణమైంది. తమ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ రెవోల్ట్ మోటార్స్ కు ఆగస్టు నెలలో భారీగా బుకింగ్స్ వచ్చినట్లు తెలిపింది. ఆజాదీ ఫ్రమ్ పెట్రోల్ క్యాంపెయిన్ చేపట్టి రూ.20 వేల వరకు ప్రయోజనాలు ప్రకటించిన క్రమంలో ఈ ఎలక్ట్రిక్ బైక్స్‌కు ఒక్కసారిగా బుకింగ్స్ పెరిగాయి. కొనుగోలుదారులు పెరగడంతో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. ఇవాళ మార్కెట్లు పడుతున్నా ఈ స్టాక్ కొనేందుకు మదుపరులు ఎగబడ్డారని చెప్పవచ్చు. ఇది రూ.60లోపే లభిస్తోన్న ఒక పెన్నీ స్టాక్.


కంపెనీ ఎక్స్చేంజీ ఫైలింగ్ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారేందుకు రైడర్ల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే రెవోల్ట్ ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లపై కంపెనీ జీరో ఇన్సూరెన్స్ ఫీ సహా అదనపు సేవింగ్స్ ప్రకటించింది. మరోవైపు.. రెవోల్ట్ ఉత్పత్తుల్లో ఆర్‌వీ 400, ఆర్‌వీ 400 బీఆర్‌జెడ్, ఆర్‌వీ 1, ఆర్‌వీ 1 ప్లస్, ఆర్‌వీ బ్లేజ్ ఎక్స్ వంటి బైక్స్ ఉన్నాయి. ఇండియన్ రైడర్స్ కోసం ప్రత్యేంగా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఫీచర్ కనెక్టెడ్ టెక్నాలజీ, స్మార్ట్ రైడింగ్ మోడ్స్, తక్కువ రన్నింగ్ కాస్ట్ వంటివి ఈ బైక్స్ ప్రత్యేకత. ప్రస్తుతం దేశంలోని 200లకు పైగా నగరాల్లో ఈ బ్రాండ్ విక్రయాలు జరుపుతోంది.


రట్టన్ ఇండియా కంపెనీ 2023, జనవరిలోనే రెవోల్డ్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. 100 శాతం వాటా చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఉత్పత్తిని గణనీయంగా పెంచుతూ దేశవ్యాప్తంగా బ్రాండ్ ప్రచారం చేపడుతోంది. మొత్తంగా 211 స్టోర్స్ ఉన్నాయి. జూన్ త్రైమాసికంలోనే 50 వేల ఎలక్ట్రిక్ బైక్ మార్క్ అందుకోవడం గమనార్హం. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు 12,322 బైక్స్ విక్రయించింది. ఈ గణాంకాల నేపథ్యంలో స్టాక్ రాణిస్తోంది.


ఇవాళ మార్కెట్లు ముగిసే నాటికి రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ 10.28 శాతం లాభంతో రూ.58.25 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 4 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 36 శాతం లాభాలు అందించింది. ఏడాది కాలంలో చూస్తే మాత్రం 30 శాతం నష్టపోయింది. గడిచిన 5 సంవత్సరాల్లో మాత్రం 930 శాతం లాభాలు ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.10 లక్షలకు పైగా అందించింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.84.70 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.37.42గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa