అమెరికా ఇటీవల భారత్పై భారీగా సుంకాలు విధించింది. భారత్ ఒక డెడ్ ఎకానమీ అంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మాటలతో కాదు తాము చేతలతోనే సమాధానం చెప్తామని చేసి చూపించింది. అమెరికా సుంకాల ప్రభావం ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో సత్తా చాటింది. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. అమెరికాకు భారత్ ఒక పవర్ ఫుల్ మెసేజ్ పంపించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలమైనదని, స్థిరమైన వృద్ధిని సాధించగలదని నిరూపించింది.
తాజాగా కేంద్ర గణాంకాల విభాగం దేశ స్థూల ఆర్థిక వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో 7.8 శాతం నమోదైనట్లు తెలిపింది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని తెలిపింది. తాజాగా విడుదలైన జీడీపీ గణాంకాలు అమెరికాకు చెంపపెట్టుగా చెప్పవచ్చుని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండగా అంతకు ముందు ఏడాది అదే త్రైమాసికంలో 6.7 శాతంగా ఉంది.
భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే భారత జీడీపీ గణాంకాలు వెలువడడం గమనార్హం. అలాగే గత నెలలో ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ఒక డెడ్ ఎకానమీ అని అన్న వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ భారత్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. ట్రంప్ వ్యాఖ్యలను నిరాధారమైనవిగా, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా నిరూపించింది.
దేశ వాస్తవ జీడీపీ స్థిర ధరల్లో చూస్తే ఈ ఏడాది ఏప్రిల్- జూన్లో రూ.47.89 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.44.42 లక్షల కోట్లుగా ఉందని, దాంతో పోలిస్తే ఈసారి 7.8 శాతం వృద్ధి నమోదుచేసినట్లు తెలిపింది. అయితే, నామమాత్ర జీడీపీ ప్రస్తుత ధరల్లో చూస్తే ఏకంగా రూ.86.05 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.79.08 లక్షల కోట్లుగా ఉండగా దాంతో పోలిస్తే 8.8 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఇక రంగాల వారీగా చూస్తే వ్యవసాయం రంగంలో 3.7 శాతం వృద్ధి నమోదు కాగా తయారీ రంగంలో 7.7 శాతం వృద్ధి నమోదైంది. సేవల రంగానికి వస్తే 9.3 శాతం వృద్ధి సాధించింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార రంగాలు 8.6 శాతం వరకు వృద్ధి సాధించాయి. ఫైనాన్షియల్, స్థిరాస్తి, ప్రొఫెషనల్ సేవల రంగాలు 9.5 శాతం పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa