ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి 3 శాతం కోటా అమలు చేస్తాం,,,,మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 07:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వారికి 3 శాతం కోటా అమలు చేస్తామని తెలిపారు. నారా లోకేష్ చెప్పింది ఎవరి గురించి అంటే క్రీడాకారులు. రాష్ట్రంలో స్పోర్ట్స్‌ని ప్రోత్సాహించడం కోసం తమ ప్రభుత్వం 3 శాతం స్పోర్ట్స్ కోటాను అమలు చేయాలని నిర్ణయించినట్లు నారా లోకేష్ తెలిపారు. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇండియా మహిళా క్రికెట్ టీమ్ సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులకు మూడు శాతం స్పోర్ట్స్ కోటాను అమలు చేస్తామని తెలిపారు.


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సాహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేసిన సమయంలో ఆఫ్రో ఏషియన్ క్రీడలను నిర్వహించారని.. అలానే అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్‌ని కూడా నిర్మించారని ఈ సందర్భగా లోకేష్ గుర్తు చేశారు.


రానున్న పదేళ్లలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని నారా లోకేష్ తెలిపారు. అలానే ఇటీవల ఏపీలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మోదీ పిలుపు మేరకు ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని లోకేష్ చెప్పుకొచ్చారు. క్రీడలను ప్రోత్సాహించేందుకు మూలాల నుంచే ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.


అలానే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవని.. ప్లే గ్రౌండ్ల కొరతతో పాటుగా.. చాలా పాఠశాలల్లో పీఈటీలు లేరని లోకేష్ అంగీకరించారు. రాత్రికి రాత్రే క్రీడారంగాన్ని మార్చడం కష్టతరమైన పని అన్నారు. అలానే ఇప్పటికి కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సాహించడం లేదని.. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.


అనంతరం లోకేష్ భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వీరు.. ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలికైన విషయం కాదన్నారు. చాలా కాలం వరకు మహిళా క్రికెట్ జట్టుకు తగినన్ని సదుపాయాలు ఉండేవి కావని.. మీడియా కవరేజీ కూడా అంతగా ఉండేది కాదని.. మహిళా క్రికెట్ టీమ్‌ను సరిగా పట్టించుకునేవారు కాదని తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. వారి టాలెంట్‌తో క్రీడాభిమానులు తలెత్తుకునేలా చేశారని ప్రశంసించారు. గత వరల్డ్ కప్లలో భారత మహిళా జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని లోకేష్ కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa