గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు. కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. ఇక కూలీ పని లేనప్పుడు భర్త కారు డ్రైవింగ్ పనికి వెళ్తుంటారు. అలా కారు డ్రైవింగ్ కోసం వెళ్లినప్పుడు అతనికి కృష్ణా జిల్లాకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో తరచూ బాడుగకు పిల్చేవాడు. దీంతో ఈ పరిచయం కాస్తా నమ్మకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే సుధాకర్ తనకు తాంత్రిక విద్యలు తెలుసంటూ.. కారు డ్రైవర్ అయిన మనోడిని నమ్మించాడు. ఈ తాంత్రిక విద్యల సాయంతో ఏం కావాలంటే అది జరుగుతుందన్నాడు. ఇంకా నమ్మించేందుకు ఓ ట్రిక్ కూడా ప్లే చేశాడు సుధాకర్.
శరీరం మీద ఉన్న దుస్తులు అన్నీ విప్పేసి.. చేతిలో తెల్లని కాగితం పట్టుకున్న సుధాకర్.. ఆ కాగితానికి పాదరసంలాంటి లిక్విడ్ పూసి గాల్లోకి విసిరేశాడు. అయితే మాయ చేశాడో ఏమో కానీ.. గాల్లో నుంచి కిందకు రూ.500 నోట్లు కిందపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న కారు డ్రైవర్ వాటిని తీసుకుని.. బయట షాపులలో వస్తువులు కూడా కొన్నాడు. ఇలా ఒకట్రెండుసార్లు చేయటంతో కారు డ్రైవర్కు.. సుధాకర్ మీద గురి కుదిరింది. ఆ తర్వాత సుధాకర్ మాయాజలం మొదలైంది.
నీ వద్ద ఉన్న డబ్బులు ఇస్తే దానిని పదిరెట్లు చేసి ఇస్తానంటూ కారు డ్రైవర్ను నమ్మించాడు. దీంతో కారు డ్రైవర్ అత్యాశకు పోయి.. తన వద్ద ఉన్న రూ.10 లక్షలు సుధాకర్ ఖాతాకు బదిలీ చేయించాడు. ఈ పది లక్షల రూపాయలను కోటి రూపాయలు చేస్తానన్న సుధాకర్.. అయితే ఇందుకు ఎక్కువమొత్తంలో లిక్విడ్ అవసరం అవుతుందని డ్రైవర్కు చెప్పాడు. ఇందుకోసం 21 రోజులు సమయం పడుతుందని నమ్మించాడు. అలా చెప్తూ మే నుంచి కాలం వెల్లదీస్తూ వచ్చిన సుధాకర్.. ఇటీవల ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయామని గుర్తించిన కారు డ్రైవర్.. సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేసిన బాధితులు.. సుధాకర్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు పెనమలూరులో షేర్ల కొనుగోలు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.39.15 లక్షలు కొట్టేశారు. పోరంకికి చెందిన మహిళ జూన్లో ఓ వాట్సాప్ గ్రూప్లో చేరారు. ఆ గ్రూప్లో అప్పటికే 94 మంది సభ్యులు ఉన్నారు. అందులోని రాజీవ్ మెహతా అనే వ్యక్తి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక వాట్సాప్ గ్రూపు నిర్వాహకుల సూచనతో వారు పంపిన లింకులో పోరంకి మహిళ రూ.39,15,181 పెట్టి విడతల వారీగా షేర్లు కొనుగోలు చేశారు. అయితే గడిచిన 20 రోజుల నుంచి షేర్ల విక్రయానికి ప్రయత్నించగా.. కుదరలేదు. నిర్వాహకులు స్పందించలేదు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa