టీమిండియా స్పాన్సర్షిప్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద రంగాలకు చెందిన కంపెనీలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయిస్తూ, కొత్త స్పాన్సర్ కోసం మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రభావంతో ప్రస్తుత స్పాన్సర్ డ్రీమ్ 11 వైదొలగడంతో ఈ ప్రక్రియ అనివార్యమైంది.బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఏ సంస్థ కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొనడానికి వీల్లేదు. ఈ నిబంధన కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీటితో పాటు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, ఎక్స్ఛేంజ్లు, టోకెన్ల వ్యాపారంలో ఉన్న కంపెనీలను కూడా అనర్హులుగా ప్రకటించింది. ఇప్పటికే నిషేధానికి గురైన బ్రాండ్లతో అనుబంధం ఉన్న సంస్థలకు కూడా అవకాశం లేదని తేల్చిచెప్పింది.ఈ స్పాన్సర్షిప్ హక్కుల కోసం పోటీపడే కంపెనీలకు మరో ముఖ్యమైన నిబంధనను కూడా బీసీసీఐ విధించింది. దరఖాస్తు చేసుకునే సంస్థల వార్షిక టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలి. ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.ఈ స్పాన్సర్షిప్ ప్రధానంగా టీమిండియా జెర్సీలకు సంబంధించినది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ టోర్నమెంట్ కంటే ముందే కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa