ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ చదివినవారికి టీటీడీ గొప్ప అవకాశం.. ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 07:26 PM

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. మరికొందరు శ్రీవారి సేవకులుగా.. వెంకన్న సేవలో తరిస్తూ ఉంటారు. శ్రీవారి సేవకులుగా సేవలందించేందుకు భక్తులకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. అలా సేవలు అందించిన వారికి ఆ తర్వాత శ్రీవారి దర్శనం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ఆధ్వర్యంలో ఆస్పత్రులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రులలో పనిచేసేందుకు శ్రీవారి భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.


ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో సేవ చేయడానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తితో ముందుకు వచ్చేవారికి ‘శ్రీవారి సేవ ట్రైనర్‌’ పేరుతో శిక్షణ అందిస్తామన్నారు. మూడ్రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. మరోవైపు టీటీడీ ఆస్పత్రులలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చే భక్తులు కనీసం డిగ్రీ చదివి ఉండాలని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తిరుపతిలో ఉన్న స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రుల్లో వీరి సేవలు ఉపయోగించుకోనున్నారు. మరోవైపు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు ముందుకొస్తున్నారని, వీరి సేవలు కూడా వినియోగించుకుంటామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.


  మరోవైపు తిరుమలలోని బిగ్‌ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు మరింత రుచిగా ఆహారం అందించేందుకు బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో క్యాంటీన్ల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరించారని.. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు.


టీటీడీ వార్నింగ్..


మరోవైపు శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరించింది. టీటీడీ సేవల పేరుతో భక్తులను నకిలీ వెబ్ సైట్ల ద్వారా మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతూ ఉండటంతో టీటీడీ ఈ వార్నింగ్ ఇచ్చింది. ఏవైనా అనుమానాలు ఉంటే టీటీడీ విజిలెన్స్ నంబర్ 0877 – 2263828 ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని టీటీడీ సూచించింది. అలాగే టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా ttdevasthanams mobile app సందర్శించాలని.. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు ఫోన్ చేయాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa